
సాక్షి, ఢిల్లీ: ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును డిక్టేట్ చేయవద్దని జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం రఘురామపై సీరియస్ అయ్యింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులను వేగంగా విచారించాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టులను తాము కంట్రోల్ చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులపై కేసులను వేగవంతంగా విచారించాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు అవుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే సమయంలో డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు అవుతున్నాయో, వాటి వివరాలు ఏవీ తమకు తెలియదని వ్యాఖ్యానించింది. అలాగే, అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించేందుకు ట్రయల్ కోర్టులు ఉన్నాయి. ప్రతీ దాన్ని మేము కంట్రోల్ చేయాలంటే వందల కేసులు ఉంటాయని తెలిపింది. కోర్టును డిక్టేట్ చేయవద్దని రఘురామపై సీరియస్ అయ్యింది.
విచారణ సందర్భంగా రఘురామపైనే సీబీఐ కేసులు ఉన్నాయని సీనియర్ అడ్వకేట్ జనరల్ నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామ ముద్దాయి అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కేసుల విచారణను ట్రయల్ కోర్టులే చూసుకుంటాయని జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం, తదుపరి విచారణను నవంబర్కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment