
ముంబై: తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తరచూ ఢిల్లీకి పర్యటించటంపై ఎన్సీపీ( ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లడానికి ఇష్టపడని తన సోదరుడు గుర్తుకువస్తున్నారని అన్నారు. నవంబర్ 20న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లారు. అజిత్ పవార్ తరచూ ఢిల్లీకి వెళ్లటంపై మీడియా అడిగిన ప్రశ్నకు సుప్రియా సూలే స్పందించారు.
‘‘ఢిల్లీకి వెళ్లడానికి ఎప్పుడూ ఇష్టపడని అజిత్ దాదా మాత్రమే నాకు గుర్తున్నారు. కొన్ని నెలలు నేను ఆయనతో టచ్లో లేను. ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారో నాకు తెలియదు. ఆయన ఢిల్లీకి ఎందుకు వచ్చారో నేను సమాధానం చెప్పలేను’’ అని అన్నారు.
మరోవైపు.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకానికి సంబంధించిన ఒప్పందం దాదాపు ఖరారు చేసినట్లు అజిత్ పవార్ మంగళవారం తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుత కూటమి సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. బీజేపీ 152-155 సీట్లు, శివసేన (షిండే) 78-80 సీట్లు, ఎన్సీపీ( అజిత్ పవార్)కు 52 నుంచి 54 సీట్లలో పోటీచేసేలా ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. బీజేపీ ఇప్పటికే 99 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. శివసేన( షిండే) 45 మందితో మంగళవారం తొలి జాబితా విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment