చంద్రబాబు స్వార్థ రాజకీయం.. జరగని తప్పుపై 'రాద్ధాంతం': వైఎస్‌ జగన్‌ | YSRCP president and former CM YS Jagan letter to PM Modi | Sakshi
Sakshi News home page

చంద్రబాబు స్వార్థ రాజకీయం.. జరగని తప్పుపై 'రాద్ధాంతం': వైఎస్‌ జగన్‌

Published Mon, Sep 23 2024 4:16 AM | Last Updated on Mon, Sep 23 2024 7:08 AM

YSRCP president and former CM YS Jagan letter to PM Modi

ప్రధాని మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

కల్తీ నెయ్యిని వాడనే లేదు.. ఇక అపచారానికి తావెక్కడ?

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు

కోట్లాది మంది భక్తుల మదిలో అనుమాన బీజాలు నాటుతున్నారు

ఇలా చేయడం దుర్మార్గమని, అన్యాయమని చంద్రబాబును మందలించండి

ఆలయ పవిత్రతను దెబ్బ తీయొద్దని గట్టిగా చీవాట్లు పెట్టండి

టీటీడీ ఔన్నత్యం దెబ్బతీనేలా నిస్సిగ్గుగా వ్యవహరించడం తగదని బుద్ధి చెప్పండి

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది.

సాక్షి, అమరావతి: పచ్చి అబద్ధాలు చెప్పే అలవాటున్న సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పరమ పవిత్రమైన తిరుమల శ్రీవెంకటేశ్వ­ర­స్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ కోట్లాది మంది భక్తుల విశ్వా­సాలను దెబ్బ తీసే స్థాయికి దిగజారారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. జరగని తప్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. 

లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగించనప్పుడు తప్పు జరిగే అవకాశమే లేదని చెప్పారు. వాస్తవం ఇలా ఉండగా కోట్లాది మంది హిందూ భక్తుల మదిలో అనుమానాలు సృష్టించిన చంద్రబాబును మందలించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చర్యలు ముఖ్యమంత్రి పదవినే కాకుండా ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థాయిని దిగజార్చాయని, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీని, ఆ సంస్థ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బ తీశాయాని ఆవేదన వ్యక్తం చేశారు. 

భక్తుల విశ్వాసాలను, టీటీడీ ఔన్యత్యాన్ని దెబ్బతీసేలా అబద్ధాలను వ్యాప్తి చేసి, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న చంద్రబాబును గట్టిగా చీవాట్లు పెట్టాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.

ప్రజల దృష్టి మళ్లించడానికే.. 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయి. 

భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారి తీస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా, గొప్పలు చెప్పుకునేందుకు టీడీపీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ కొత్త ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం ప్రతికూలంగా ఉంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, నిలబెట్టుకోవడంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 

ఎన్నికల హామీల విషయంలో ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో చంద్రబాబు కనీసం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోయారు. చంద్రబాబు పాలనా సమర్థతపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. 

కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తప్పుడు ఆరోపణలు చేశారు. కేవలం రాజకీయ స్వార్థ్యంతోనే చంద్రబాబు ఇలా దారుణంగా ప్రచారం చేశారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.

కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనేలేదు 
కల్తీ జరిగిందనే ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. దశాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. అలా ట్యాంకర్లు వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. అది కోట్ల మంది తిరుమల భక్తుల్లో ఆవేదనకు దారి తీసింది.

టీటీడీ బోర్డు స్వతంత్ర సంస్థ 
శ్రీవారి ఆలయం అవసరాలకు సంబంధించి ఎలాంటి కొనుగోళ్లు జరిపినా, వాటి విషయంలో టీటీడీ దశాబ్దాలుగా అత్యుత్తమ విధానాలు అనుసరిస్తోంది. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ వ్యవహారాలన్నింటినీ కూడా టీటీడీ బోరుŠడ్‌ పర్యవేక్షిస్తుంది. ఇది స్వతంత్ర సంస్థ. తిరుమల ఆలయ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాత్ర పరిమితంగా ఉంటుంది. 

ధర్మకర్తల మండలిలో భక్తులు, వేర్వేరు రంగాల్లో ఆధ్యాత్మిక ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి వారిని టీటీడీ సభ్యులుగా సిఫార్సు చేస్తారు. ఇటీవలి టీటీడీ బోర్డులో బీజేపీకి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు.  

స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ముడి సరుకులు కొనుగోలు 
⇒ టీటీడీ అవసరాలకు అవసరమైన ఆవు నెయ్యి కొనుగోలు కోసం ఇ⇒ టెండర్‌ ప్రక్రియను అనుసరిస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్‌ పక్రియను చేపడుతుంది. టెండర్‌ పక్రియలో పేర్కొన్న నియమ నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా సంస్థను ఎంపిక చేస్తుంది. ఆమోదం కోసం టీటీడీ బోర్డు ముందు ఉంచుతారు. టీటీడీలో కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 

⇒ 2014–2019 మధ్య టీడీపీ హయాంలో కూడా అదే పద్ధతి ఉంది. నెయ్యిని వినియోగించే మందు దాని నాణ్యతను పరిశీలించడానికి తనిఖీ వ్యవస్థలు కూడా ఉన్నాయి. నెయ్యిని ఆలయానికి పంపే ముందు దాని స్వచ్ఛత, నాణ్యతలపై ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌) ద్వారా గుర్తింపు పొందిన ఏజెన్సీల నుంచి తప్పనిసరిగా ధృవీకరణ ఉండాలి. 

⇒ అలాగే ఆలయంలోని వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్‌ నుండి మూడు నమూనాలు తీసుకుని పరీక్షిస్తారు. ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. ఇలాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందు వల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. 

⇒ 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించారు. అటువంటి ధృఢమైన విధానాలు, పద్ధతులు అమలులో ఉన్నందున, కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారీకి ఆస్కారమే లేదు. ఈ విధానం గత కొన్ని దశాబ్దాలుగా టీటీడీలో అమలులో ఉంది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు.. టీటీడీలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాల గురించి, టీటీడీ ప్రతిష్ట గురించి ప్రజలకు చెప్పాల్సింది పోయి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరించారు.

⇒ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ట్యాంకర్లను తిరస్కరించిన పద్ధతుల్లో భాగంగానే జూలై నెలలో కూడా నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించారు. తిరస్కరించిన ట్యాంకర్లను ఆధారంగా చేసుకుని 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టీడీపీ రాజకీయ సమావేశంలో చంద్రబాబు సున్నితమైన ఈ అంశంపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ ఉద్దేశాలు ఇట్టే అర్థం అవుతున్నాయి. కచ్చితంగా ఇది నేరం.

నిర్ధారించుకోకుండా ఆరోపణలా? 
⇒ ఎన్‌డీడీబీ కాల్ఫ్‌ లిమిటెడ్‌ నుంచి వచ్చిన నివేదికలో పేర్కొన్న ఎస్‌ ⇒ విలువలు నిర్దేశించిన విలువల పరిమితి కన్నా తక్కువ ఉండడంపై ల్యాబ్‌ కొన్ని సందేహాలను వ్యక్తం చేసింది. ఏయే పరిస్థితుల్లో ఈ పరీక్షలు తప్పు కావచ్చనే అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది. తాము ఇచ్చిన రిజల్ట్స్‌లో కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లోపించే అవకాశం ఉందని అందులో ఉంది. 

⇒ పోషకాహార లోపం ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, వెజిటబుల్‌ ఆయిల్స్‌ను ఆహారంగా తీసుకునే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసిన నెయ్యి వల్ల, వేర్వేరు విధానాలతో తీసే నమూనాల వల్ల కచ్చితత్వం లోపిస్తుందని నివేదికలో ఉంది. పైన పేర్కొన్న పరిస్థితుల్లో ల్యాబ్‌ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తాయని పేర్కొంది.

⇒ ఉదాహరణకు పోషకాహార లోపం ఉన్న ఆవు నుండి వచ్చే పాల నుంచి నెయ్యి పొందినట్లయితే లేదా పామాయిల్‌ అధికంగా తినిపించిన ఆవు పాల నుంచి నెయ్యి పొందినట్లయితే, జంతువు కొవ్వు ఉనికిని సూచించే పరీక్షల్లో కచ్చితత్వంతో సరైన ఫలితాలు కొనుగొనేందుకు అవకాశాలు ఉండవు. పరీక్షల్లో కచ్చితత్వంపై నిర్ధారణ లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దిగ్భ్రాంతి కలిగించే ఆరోపణలు చేయకూడదు.

⇒ ప్రజా జీవితంలో తనకు అపారమైన అనుభవం ఉందంటూ పదే పదే గొప్పలు చెప్పుకునే చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీ లాంటి సంస్థ అంకిత భావాన్ని, పవిత్రతను, కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బ తీసేందుకు అవకాశం ఉండే ఇలాంటి అంశాలపై తప్పుగా మాట్లాడకూడదు. ఎన్‌డీడీబీ పరీక్షల నివేదికను ఈ లేఖకు జత చేస్తున్నాను. పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

టీడీపీ హయాంలోనూ కేఎంఎఫ్‌ సరఫరా చేయలేదు 
⇒ కొన్నేళ్లుగా తిరుమలలో కర్ణాటక కో ఆప్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (కేఎంఎఫ్‌) నెయ్యి సరఫరా చేసేదని, దాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిలిపేసిందని టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది పూర్తిగా సత్యదూరం.

⇒ 2014–19 మధ్య టీటీడీ నిర్వహించిన టెండర్లలో కేఎంఎఫ్‌ కొన్నిసార్లు మాత్రమే టెండర్లలో పాల్గొంది. వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉన్న 2015 నుంచి 2018 అక్టోబర్‌ వరకు కేఎంఎఫ్‌ టీటీడీకి నెయ్యి సరఫరా చేయక పోవడం గమనార్హం.  

⇒ టెండర్ల ప్రక్రియలో పాల్గొని ఎల్‌–1 నిలిచి ఎంపికైన ప్రైవేటు సంస్థలే నెయ్యి సరఫరా చేశాయి. అలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొన్నిసార్లు కేఎంఎఫ్‌ ద్వారా నెయ్యి సరఫరా జరిగిన సందర్భాలు ఉన్నాయి. నందిని నెయ్యి విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం.

టీటీడీ ప్రతిష్టను ఇనుమడింపజేసింది మేమే 
నిజానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చేపట్టిన కొన్ని చర్యల పట్ల నేను గర్వపడుతున్నాను. ఆలయంలో వినియోగించే నెయ్యి సహా సరుకుల స్వచ్ఛత, నాణ్యతలపై పరీక్షలు జరపడానికి ప్రయోగశాలలను బలోపేతం చేశాం. ఈ విషయంలో ప్రఖ్యాత సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) సేవలను టీటీడీ తీసుకుంది.

⇒ నవనీత సేవను ప్రారంభించడమే కాకుండా, శుద్ధ నెయ్యి సరఫరా కోసం తిరుమలలో గోశాలను స్థాపించాం.
⇒ టీటీడీ అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు అందించాం.
⇒ జమ్మూలో మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి సమీపంలో టీటీడీ ఆలయం నిర్మించాం. 2023లో దీన్ని ప్రారంభించామని గుర్తు చేస్తున్నాం. ముంబై, రాయ్‌పూర్, అహ్మదాబాద్‌లలో బాలాజీ కొత్త ఆలయాల నిర్మాణం ప్రారంభించాం.

రెండు నెలల తర్వాత టీడీపీ ఆఫీసులో పరీక్ష నివేదిక విడుదల 
చంద్రబాబుది చిత్తశుద్ధి లేని, కపట వైఖరి అని చెప్పడానికి మరో అంశాన్ని ప్రస్తావిస్తున్నా. 2024 జూలై 12వ తేదీన తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్‌లోని నమూనాలు సందేహాస్పదంగా ఉన్నాయని, మూడు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించ లేకపోయాయని, వాటి నమూనాలను కూడా పంపినట్లు బహిరంగంగా వెల్లడించారు. ఆ తర్వాత ఆ నమూనాలను ఎన్‌డీడీబీ కాల్ఫ్‌ 2024 జూలై 17న పంపింది. 

వాటిని పరిశీలించి, పరీక్షలు చేసి విశ్లేషించిన ఫలితాలను 2024 జూలై 23న నివేదించారు. నెయ్యి కల్తీ జరిగిందన్న సందేహాలు వ్యక్తమైన ట్యాంకర్లు టీటీడీ ఆవరణలోకే అనుమతించ లేదన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు భక్తుల మనోభావాలను పూర్తిగా పట్టించుకోకుండా రాజకీయ ఉద్దేశాలతో అసత్యాలను ప్రచారం చేశారు. దుర్మార్గపు ఉద్దేశాలతో వ్యవహరించారు. 

2024 సెప్టెంబరు 18న జరిగిన రాజకీయ పార్టీ సమావేశంలో ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ట్యాంకర్‌ తిరస్కరించిన రెండు నెలల తర్వాత టీడీపీ కార్యాలయం నుంచి ల్యాబ్‌ నివేదిక విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను కించ పరిచేలా మొత్తం ఈ అంశాన్ని రాజకీయ లక్ష్యాల సాధన కోసం ఉపయోగించుకునేందుకు వేసిన పథకం ఇది. చంద్రబాబు బాధ్యతా రాహిత్య వైఖరిని ఇది స్పష్టం చేసింది. 

ల్యాబ్‌ రిపోర్టు వచ్చిన తర్వాత రెండు నెలలపాటు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదని, ఒకవేళ అలా చేసి ఉంటే నిరంతరంగా జరిగే నాణ్యత, స్వచ్ఛత నిర్ధారణ తనిఖీల్లో అది తేలుతుందనే విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే.. రెండు నెలలపాటు మౌనంగా ఉన్నారు. అందుకనే తదుపరి చంద్రబాబు చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యం, పచ్చి అబద్ధం. కేవలం రాజకీయ లక్ష్యాల కోసం ఈ ఆరోపణలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement