
ఇక్ఫాయ్– టీహబ్ మధ్య కుదిరిన ఒప్పందం
శంకర్పల్లి: మండలంలోని దొంతాన్పల్లిలో గల ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇక్ఫాయ్ అంకుర సంస్థ– టీ హబ్ ఫౌండేషన్ మధ్య మంగళవారం ఓ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు కళాశాలలో ఇక్ఫాయ్ వైస్ చాన్సలర్ ఎల్.ఎస్.గణేశ్, టీ హబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సుజిత్ జాగిర్దార్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. వీసీ గణేశ్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరిశ్రమలు, విద్యారంగ సాధికారత అనే అంశాలపై నాలెడ్జ్ పెంపొందించుకోవచ్చని, విద్యార్థులకు టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన వస్తుందన్నారు. సుజిత్ జాగిర్దార్ మాట్లాడుతూ.. స్టార్టప్ కంపెనీలకు సాంకేతికంగా సాయం చేసేందుకు టీ హబ్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీ హబ్ సీనియర్ ఇన్వెస్టడ్ స్టార్టప్ ఫండ్, సీనియర్ డైరెక్టర్ దేవిశెట్టి చింటిరెడ్డి, చీఫ్ డెలివరీ ఆఫీసర్ ఫణి కొండెపూడి, ఇక్ఫాయ్ రిజిస్ట్రార్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
నగరానికి నిధుల కేటాయింపు అంతంతే..
అసెంబ్లీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం నుంచి రాష్ట్ర ఖాజానాకు సింహభాగం ఆదాయం వచ్చి చేరుతున్నా..బడ్జెట్లో నిధుల కేటాయింపు మాత్రం మొక్కుబడిగా ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ, జలమండలికి, ఇతర సంస్థలకు నామమాత్రంగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. వాటర్బోర్డుకు కేవలం రూ. 3,383 కోట్ల కేటాయించారని, అందులో 3,083 కోట్ల అప్పుల చెల్లింపు, ఉచిత నీటి రియింబర్స్మెంట్ కింద రూ.300 కోట్ల కేటాయించారని గుర్తు చేశారు. అభివృద్ధి పనులుకు ఏ మాత్రం కేటాయించలేదని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం తక్షణమే రూ. 1500 కోట్ల కేటాయించాలన్నారు. జీహెచ్ఎంసీకి నిధులు కేటాయిపు పెంచాలన్నారు. నగర అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు. విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కారించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు చేయాలని రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రత్యామ్నాయ స్థలంపై వీడిన వివాదం
శంషాబాద్: పంచాయతీ అవసరాలకు స్థలాన్ని అప్పగించి ప్రత్యామ్నాయంగా తీసుకున్న స్థలం సరైందేనని హైకోర్టు తీర్పునిచ్చిందని బాధితులు చింతల రామకృష్ణ, చింతల లక్ష్మణ్ తెలిపారు. కోర్టు తీర్పువచ్చిన తర్వాత కూడా తమను కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారన్నారు. వివరాలు వారి మాటల్లోనే.. శంషాబాద్ పట్టణంలో 2001లో మహిళా మండలి భవనం వెనకాల భోజనశాల కోసం అప్పటి పంచాయతీ పాలకవర్గం మా తల్లి చింతల అన్నపూర్ణకు సంబంధించిన 430 గజాల స్థలాన్ని తీసుకుని పట్టణంలోని బృందావన్ కాలనీలో సర్వే నంబరు 687, 688 ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించారు. సంబంధిత స్థలంలో గృహ నిర్మాణానికి పంచాయతీ అనుమతి కూడా జారీ చేశారు. ఇందులో గతంలోనే కొంత స్థలాన్ని తాము విక్రయించగా మిగిలి స్థలమైన ప్లాటు నంబరు 173, 174లో ఉన్న 430 గజాల స్థలం పార్కు స్థలంగా పేర్కొంటు కాలనీ అసోసియేషన్ పలుమార్లు కోర్టును ఆశ్రయించినప్పటికీ తమకే సానుకూలమైన తీర్పువచ్చిందన్నారు. 2014 తర్వాత అసోసియేషన్ ప్రమేయంతో అప్పటి పంచాయతీ పాలకవర్గం సంబంధిత స్థలాన్ని వివాదాస్పదంగా పేర్కొంటు తీర్మానం చేయడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. పంచాయతీ తమ వద్ద భూమిని తీసుకుని ప్రత్యామ్నాయంగా అందజేయడానికి చేసిన బదలాయింపు డీడ్ను సమర్థించి హైకోర్టు తుది తీర్పును అందజేసిందన్నారు. హైకోర్టు తుదితీర్పు ఆధారంగా తాము పనులు చేసుకుంటుండగా కాలనీవాసులు 9 మంది వరకు వచ్చిన గత నాలుగైదు రోజులుగా పనులు చేస్తే బాగుండదని బెదిరిస్తున్నారన్నారు. సంబంధిత వ్యక్తులపై ఆర్జీఐఏ పోలీసులకు ఈనెల 19న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను ఆర్జీఐఏ పోలీసులతో పాటు మున్సిపాలిటీకి అందజేసినట్లు పేర్కొన్నారు.
పండగలు శాంతియుతంగా జరుపుకోవాలి
శంషాబాద్: పండగలు శాంతియుతంగా జరుపుకోవాలని శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్కుమార్, శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్రావు సూచించారు. పట్టణంలో డీసీపీ కార్యాలయంలో మంగళవారం ఆర్జీఐఏ, శంషాబాద్, కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రజలతో శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పండగ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానికులు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఐఏ సీఐ బాలరాజు, శంషాబాద్ సీఐ నరేందర్రెడ్డి మాజీ కౌన్సిలర్ జహంగీర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.