
దేశీయ విత్తనాలతో భూతాపానికి చెక్
● రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి ● రెండో రోజుకు చేరిన తెలంగాణ తొలి విత్తనాల పండుగ
కడ్తాల్: దేశీయ విత్తనాల అభివృద్ధితోనే భూతాపాన్ని తగ్గించుకోవచ్చని.. ఒక డిగ్రీ సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే 15 నుంచి 20 శాతం ఆహార ఉత్పత్తి తగ్గుతుందని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) పర్యా వరణ సంస్థ–భారత్ బీజ్ స్వరాజ్మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎర్త్ సెంటర్లో నిర్వహిస్తున్న తెలంగాణ తొలి విత్తన పండుగ శనివారం రెండో రోజుకు చేరుకుంది. పెద్ద సంఖ్యలో, రైతులు, యువకులు, వ్యవసాయ రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, ఉపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులు, పర్యావరణ వేత్తలు తరలివచ్చారు. సంప్రదాయ విత్తనాల ప్రదర్శన స్టాల్స్ సందర్శకులు, కొనుగోలు దారులతో సందండిగా మారాయి.
రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలి
సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మోహన్ గురుస్వామి మాట్లాడుతూ.. గడిచిన 50 ఏళ్లలో వ్యవసాయ రంగంలో ఎన్నో మా ర్పులు వచ్చాయన్నారు. గతంలో 1.20లక్షలు ఉన్న వరి రకాల స్థానంలో నేడు కేవలం 3 వేల రకాల వంగడాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, సువాసన భరిత చిట్టి ముత్యాలు కనుమరుగయ్యాయని ఆందోళన వ్యక్తం చేశా రు. విత్తన పరిశోధనకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. మందిరంకంచ గచ్చిబౌలి, వక్ఫ్ బోర్డ్ అంశాల పట్ల ఉన్న శ్రద్ధ, రైతులు వాతావరణం, విత్తనాల అభివృద్ధి మీద పాలకులకు లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రభుత్వాలు ఇప్పటికై నా రైతులు, రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.
భూసారం తగ్గి రైతు ఆత్మహత్యలు
అనంతరం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ నిర్వాహకులు గున్న రాజేందర్రెడ్డి మాట్లాడుతూ... ప్రపంచీకరణ కారణంగా వ్యవసాయం, దేశీ ఆవులు తగ్గాయన్నారు. తూర్పు కొండల పశువుల పాల ఉత్పత్తులతో మానవుల ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. భూముల్లో వానపాములు తగ్గడంతో భూసారం తగ్గి రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. సీజీఆర్ సంస్థ విత్తనాలతో విప్లవాత్మకమైన మార్పును తీసుకురావాలని కోరారు. స్వదేశీ ఆహారంతో కేన్సర్, షుగర్తో పాటు, వివిధ రోగాలను నివారించేలా సహకారం అందిద్దామని తెలిపారు. సీజీఆర్ సంస్థ పర్యావరణ రక్షణకు చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ఆరోగ్యానికి ఆహార భద్రత
సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యానికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా, విత్తన పండుగ నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ విత్తనాల వైభవాన్ని తెలియజేసేందుకు, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు వర్క్షాపులను సైతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సంప్రదాయ విత్తనాలను సంరక్షిస్తూ.. ప్రకృతి సంపదను భవిష్యత్తరాలకు అందించాలని కోరారు. విజయ్రామ్ నేచురల్ ఫార్మిగ్పై సభలో సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సూదిని పద్మారెడ్డి, పాలసీ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణ నిపుణులు సాయిభాస్కర్రెడ్డి, సీజీఆర్ సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సుస్థిర వ్యవసాయాన్ని కొనసాగించాలి
స్థానిక సంప్రదాయ విత్తనాన్ని కాపాడుకుంటూనే సుస్థిర వ్యవసాయాన్ని కొనసాగించే పద్దతులను అన్వేషించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పిలుపునిచ్చారు. యువతను ఆకట్టుకునేలా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని, వ్యవసాయ రంగంలో జీవనోపాధి, ఆరోగ్యముందనే నమ్మకం వారిలో కలిగిస్తేనే, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోగలుగుతామన్నారు. అనంతరం ఎర్త్ సెంటర్లోని దేశీ విత్తన స్టాల్స్ను సందర్శించడంతో పాటు, లైబ్రరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్రెడ్డి ఉన్నారు.

దేశీయ విత్తనాలతో భూతాపానికి చెక్