ఆర్థిక ‘సహకారం’ లేదు | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ‘సహకారం’ లేదు

Published Sun, Feb 16 2025 7:22 AM | Last Updated on Sun, Feb 16 2025 7:22 AM

ఆర్థిక ‘సహకారం’ లేదు

ఆర్థిక ‘సహకారం’ లేదు

డబ్బుల్లేక కొట్టుమిట్టాడుతున్నసహకార సంఘాలు
● సిబ్బందికి జీతాలివ్వలేని దుస్థితి ● సీ, డీ గ్రేడ్‌లకు దిగజారిన26 పీఏసీఎస్‌లు ● 2024 ఆడిట్‌ నివేదికలోవెలుగులోకి ఆర్థిక పరిస్థితి

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అన్నదాతలకు అండగా నిలవాల్సిన సహకార సంఘాలు (పీఏసీఎస్‌) ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం ఆయా సంఘాల్లో పనిచేస్తున్న ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి పీఏసీఎస్‌లు దిగజారిపోయాయి. జిల్లాలో సుమారు సగానికి పైగా సహకార సంఘాలది ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా మొత్తం 53 సహకార సంఘాలున్నాయి. ఈ సహకార సంఘాల ఆర్థిక లావాదేవీలపై ఏటా సహకార శాఖ ఆడిట్‌ ప్రక్రియను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 2023–24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఈ 53 సంఘాల ఆడిట్‌ ప్రక్రియ గత నెలలో పూర్తయింది. అయితే 53 సహకార సంఘాల్లో ఏకంగా 25 సంఘాలు సీ గ్రేడ్‌లో కొనసాగుతున్నాయి. ఈ సంఘాలు కొన్నేళ్లుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. పటాన్‌చెరు మండలం భానూరు సహకార సంఘం ఆర్థిక పరిస్థితి ఏకంగా సీ గ్రేడ్‌ నుంచి డీ గ్రేడ్‌కు పడిపోవడం గమనార్హం. గతేడాది డీ గ్రేడ్‌లో కొనసాగిన కోహీర్‌ మండలం బిలాల్‌పూర్‌ సహకార సంఘం మాత్రం ఒక మెట్టు ఎక్కి సీ గ్రేడ్‌కు చేరింది. ఇలా సీ, డీ గ్రేడ్‌లలో ఉన్న సంఘాలు నష్టాల్లో కొనసాగుతున్నట్లు. ఇక ఏ గ్రేడ్‌లో ఆరు సంఘాలుండగా, బీ గ్రేడ్‌లో 21 సహకార సంఘాలు కొనసాగుతున్నట్లు తేలింది.

ఆర్థిక లావాదేవీల ఆధారంగా గ్రేడింగ్‌..

ఆయా సహకార సంఘాల ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం గ్రేడింగ్‌ ఇస్తుంది. ఆ సంఘం ఆ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, రైతులకు పంట రుణాల మంజూరు, ఆ రుణాల రికవరీ, ఎరువులు, విత్తనాలు వంటి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల అమ్మకం, ధాన్యంసేకరణ వంటి కార్యకలాపాలతో ఆయా సంఘాలకు కొంత ఆదాయం వస్తుంది. ఇలా వచ్చిన ఆదాయంతో సిబ్బంది జీతభత్యాలు, సంఘం అభివృద్ధికి వినియోగించాల్సి ఉంటుంది. కానీ, ఈ కార్యకలాపాలేవీ లేకపోవడంతో ఈ సంఘాలు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కలేకపోతున్నాయి.

ధాన్యం సేకరణ ఉన్న సంఘాలుకొంత మెరుగు..

ఏటా ఖరీఫ్‌, రబీ కొనుగోలు సీజన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన సహకార సంఘాలు కొంత మేరకు ఆర్థికంగా బలపడతాయి. ఈ కొనుగోళ్లకు సంబంధించి కమీషన్‌ రూ.లక్షల్లో వస్తుంది. ఇలా ధాన్యం సేకరణ వంటి కార్యకలాపాలకు కొనసాగిన సంఘాల ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. దీంతో ఆయా సంఘాల్లోని ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నాలుగైదు నెలలకు ఒకసారి కూడా వేతనాలు అందడం లేదు. అలాగే ఆయా సంఘాల్లోని పాలకవర్గం పీఏసీఎస్‌ అభివృద్ధి కోసం కొంత చొరవ చూపి వ్యాపార లావాదేవీలు నిర్వహించిన సంఘాలు కూడా ఆర్థిక ఇక్కట్ల నుంచి కొంత గట్టెక్కాయి. కానీ, పాలకవర్గం నిర్లక్ష్యానికి తోడు కార్యకలాపాలు లేని సంఘాలు ఇంకా ఆర్థిక సంక్షోభంలోనే కొనసాగుతున్నాయి.

ఏ–గేడ్ర్‌లో ఉన్న సంఘాలివే..

జిల్లాలో ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలను పరిశీలిస్తే.. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్‌ (సంగారెడ్డి మండలం), కసాల (హత్నుర), బొక్కస్‌గాం (నారాయణఖేడ్‌), మాచిరెడ్డిపల్లి (కోహీర్‌), తెల్లాపూర్‌ (రామచంద్రాపురం), ఝరాసంఘం సహకార సంఘాలు లాభాల్లో కొనసాగుతున్నట్లు సహకారశాఖ నిర్వహించిన ఆడిట్‌లో తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement