పకడ్బందీ వ్యూహం | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీ వ్యూహం

Published Thu, Mar 6 2025 6:49 AM | Last Updated on Thu, Mar 6 2025 6:49 AM

పకడ్బందీ వ్యూహం

పకడ్బందీ వ్యూహం

పక్కా ప్రణాళిక..

కలిసొచ్చిన బీజేపీ క్యాడర్‌

ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయానికి కారణాలివే..

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పక్కా ప్రణాళిక.. పకడ్బందీ వ్యూహం. ఇవి శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలుపు తీరాలకు చేర్చాయి. ఉమ్మడి కరీంనగర్‌–మెదక్‌– నిజామాబాద్‌– ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామచంద్రాపురానికి చెందిన చిన్నమైల్‌ అంజిరెడ్డి విజయానికి ఈ రెండు కారణాలని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రసన్న కూడా గట్టి పోటీని ఇచ్చారు. ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీగా మండలి పోరు సాగింది. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపు తేల్చలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు.

అండగా నిలిచిన కమలం క్యాడర్‌

నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి క్యాడర్‌ ఉంది. ఉమ్మడి మెదక్‌తో పాటు, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ ఎంపీ స్థానంతో పాటు, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఎంపీలుగా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం విదితమే. అలాగే ఆయా జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలుగా కూడా ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఈ ఎన్నికలను ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ క్యాడర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్‌, బండిసంజయ్‌, గొడాం నగేష్‌లకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలా ఆయా ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి పట్టు అంజిరెడ్డిని గెలుపు తీరాలకు చేర్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీజేపీ అనుబంధ సంఘాలు కీలకం

బీజేపీ అనుబంధ సంఘాలు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ – మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీనే కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే టీచర్స్‌ ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు పట్టభద్రుల స్థానాన్ని కూడా కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపులో ఆ పార్టీ క్యాడర్‌తో పాటు, దాని అనుబంధ సంస్థల కృషి ఎంతగానో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరు పకడ్బందీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని రాజకీయ నిఫుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఎన్నికల నగారా మోగక ముందు నుంచే అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పట్టభద్రులను పెద్ద ఎత్తున ఓటర్లు నమోదు చేయించారు. ఇలా ఓటరు నమోదు చేయించడం ఆయనకు కొంత కలిసొచ్చింది.

ఎమ్మెల్యేగా పోటీ చేసి..

పారిశ్రామిక వేత్త అయిన డా.చిన్నమైల్‌ అంజిరెడ్డి 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎస్‌ఆర్‌.ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంజిరెడ్డి సతీమణి గోదావరి బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం విదితమే.

సామాజిక సేవ..

2002 ఎస్‌.ఆర్‌. చారిటబుల్‌ ట్రస్ట్‌ స్థాపన. పెద్ద ఎత్తున తాగునీరు, మినరల్‌ వాటర్‌, విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్‌షిప్‌లతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాల నిర్వహణ.

అంజిరెడ్డి బయోడేటా..

పేరు: డాక్టర్‌ చిన్నమైల్‌ అంజిరెడ్డి

పుట్టిన తేదీ: 18.06.1966

తల్లిదండ్రులు : సి.రాజిరెడ్డి, ల క్ష్మీనరసమ్మ

భార్యపేరు: సి.గోదావరి

(బీజేపీ జిల్లా అధ్యక్షురాలు)

సంతానం : అనీష్‌రెడ్డి, ఆశ్విత రెడ్డి

స్వస్థలం : రామచంద్రాపురం

రాజకీయ ప్రస్థానం ఇలా..

2009లో ప్రజారాజ్యంలో చేరిక. వైఎస్సాసీపీలో పనిచేశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరిక.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ ఎంపీ టిక్కెట్‌ను ఆశించి భంగపడ్డారు. మండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement