రేపు జాతీయ లోక్ అదాలత్
జిల్లావ్యాప్తంగా ఏడు బెంచీలు ఏర్పాటు
● 21,310 పెండింగ్ కేసులు ● కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలంటున్న న్యాయనిపుణులు
సంగారెడ్డి టౌన్: కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా, జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కక్షిదారులను ఒప్పించి సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులను పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. ఒకప్పుడు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్న న్యాయసేవలు క్రమంగా కక్షిదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. సత్వరం, సమన్యాయం అందించడానికి న్యాయ సేవధికార సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇందుకోసం 1987లో జాతీయ లోక్అదాలత్ సేవలు ప్రారంభించారు. ‘రాజీయే రాజమార్గం’అనే నినాదంతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలు లోక్అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కరిస్తున్నాయి. కక్షిదారులను ఒప్పించి సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులను పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా కోర్టు పరిధిలో న్యాయవాదులు, పోలీసు అధికారులు, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ అధికారులకు అవగాహన కల్పించారు. రాజీయే రాజమార్గమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జీలు సూచిస్తున్నారు. ఈనెల 8న నిర్వహించే జాతీ య లోక్ అదాలత్ ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
పెండింగ్ కేసులు ఎక్కువగానే...
జిల్లా వ్యాప్తంగా 21,310 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ లోక్ అదాలత్కు విద్యుత్, టెలిఫోన్ రికవరీ తదితర కేసులు కూడా వస్తాయి. జాతీయ లోక్ అదాలత్ లో సివిల్, కుటుంబ, ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, మోటార్ వెహికల్ కేసులు, బ్యాంకుల రికవరీ కేసులు, ఇన్సూరెన్స్, చెక్ బౌన్స్ కేసులు, క్రిమినల్ కాంపౌండ్ కేసుల వంటివి రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సంగారెడ్డిలో 3..
జహీరాబాద్లో 2 బెంచీలు
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా 7 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. సంగారెడ్డిలో మూడు, నారాయణఖేడ్, జోగిపేటలో ఒక్కొక్కటి, జహీరాబాద్లో రెండు బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. పెండింగ్ కేసులను తొందరగా పరిష్కరించేందుకు న్యాయవాదులు, పోలీస్ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పెండింగ్ కేసులు ఉన్నవారు కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాదులు సూచించారు.
జాతీయ లోక్ అదాలత్
విజయవంతం చేయాలి
జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్ అధికారులు ప్రతీ ఒక్కరు సహకరించాలి. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరంఉండదు.
భవానీ చంద్ర,
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
రేపు జాతీయ లోక్ అదాలత్
Comments
Please login to add a commentAdd a comment