ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. సూర్యకుమార్‌ యాదవ్‌, శివం దూబే డకౌట్‌ | 25 Year Old Bowler Dismisses Rahane Suryakumar Yadav Dube in Same Over | Sakshi
Sakshi News home page

ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. సూర్యకుమార్‌ యాదవ్‌, శివం దూబే డకౌట్‌

Published Tue, Feb 18 2025 7:50 PM | Last Updated on Tue, Feb 18 2025 8:33 PM

25 Year Old Bowler Dismisses Rahane Suryakumar Yadav Dube in Same Over

సూర్య, దూబే డకౌట్‌ (PC: BCCI)

రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై స్టార్‌ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. విదర్భతో పోరులో కెప్టెన్‌ అజింక్య రహానే(Ajinkya Rahane)తో పాటు టీమిండియా స్టార్లు సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav), శివం దూబే(Shivam Dube) చేతులెత్తేశారు. ఫలితంగా ముంబై జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కాగా రంజీ ట్రోఫీ ఎలైట్‌ 2024-25 సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన రహానే సేన సెమీస్‌ చేరిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సెమీ ఫైనల్‌-2లో భాగంగా విదర్భ జట్టుతో తలపడుతోంది. నాగ్‌పూర్‌ వేదికగా.. విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

అయితే, ఆరంభంలోనే ఓపెనర్‌ అథర్వ టైడే(4) వికెట్‌ కోల్పోయిన విదర్భను మరో  ఓపెనర్‌ ధ్రువ్‌ షోరే అర్ధ శతకం(74)తో ఆదుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్పిన్‌ బౌలర్‌ పార్థ్‌ రేఖడే(Parth Rekhade) కూడా 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

383 పరుగులు
ఇక మిడిలార్డర్‌లో ప్రతి ఒక్కరు రాణించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేయగలిగింది. డానిష్‌ మాలేవార్‌(79), కరుణ్‌ నాయర్‌(45), యశ్‌ రాథోడ్‌(54) మెరుగైన ఇన్నింగ్స్‌ ఆడగా.. కెప్టెన్‌ అక్షయ్‌ వాడ్కర్‌ 34, హర్ష్‌ దూబే 18, నచికేత్‌ భూటే 11, దర్శన్‌ నాల్కండే 12*, యశ్‌ ఠాకూర్‌ 3 పరుగులు చేశారు.

ముంబై బౌలర్లలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే ఐదు వికెట్లతో చెలరేగగా.. రాయ్‌స్టన్‌ దాస్‌, షామ్స్‌ ములానీ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అదే విధంగా.. శార్దూల్‌ ఠాకూర్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విదర్భ మొదటి ఇన్నింగ్స్‌ 383 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలవగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై మాత్రం కష్టాలపాలైంది.

పార్థ్‌ రేఖడే విజృంభణ
ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే తొమ్మిది పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్‌ ఆకాశ్‌ ఆనంద్‌(171 బంతుల్లో 67 నాటౌట్‌ ) పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. సిద్దేశ్‌ లాడ్‌ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ అజింక్య రహానే 18 పరుగులకే నిష్క్రమించాడు. ఇక టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్‌ యాదవ్‌, శివం దూబే మరీ దారుణంగా డకౌట్‌ అయ్యారు.

ఈ ముగ్గురిని విదర్భ బౌలర్‌ పార్థ్‌ రేఖడే ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపడం విశేషం. ముంబై ఇన్నింగ్స్‌లో 41వ ఓవర్‌ వేసిర పార్థ్‌.. తొలి బంతికే రహానేను బౌల్డ్‌ చేశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ పార్థ్‌ బౌలింగ్‌లో డానిష్‌ మాలేవర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 

అనంతరం శివం దూబే వికెట్‌ను కూడా పార్థ్‌ దక్కించుకున్నాడు. కాగా సూర్య, దూబేలకు తొలుత డాట్‌ బాల్‌ వేసిన పార్థ్‌ ఆ మరుసటి బంతికే వాళ్లిద్దరిని అవుట్‌ చేయడం విశేషం.

ఇక ఆ తర్వాత కూడా విదర్భ బౌలర్ల విజృంభణ కొనసాగింది. షామ్స్‌ ములానీ(4)ని హర్ష్‌ దూబే వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. వేగంగా ఆడుతున్న శార్దూల్‌ ఠాకూర్‌(41 బంతుల్లో 37)ను యశ్‌ ఠాకూర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ క్రమంలో మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి ముంబై 59 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి.. విదర్భ కంటే 195 పరుగులు వెనుకబడి ఉంది. 

ఆకాశ్‌ ఆనంద్‌ 67, తనుశ్‌ కొటియాన్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. విదర్భ బౌలర్లలో పార్థ్‌ రేఖడే మూడు వికెట్లు కూల్చగా.. యశ్‌ ఠాకూర్‌కు రెండు, దర్శన్‌ నల్కండే, హర్ష్‌ దూబేలకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్‌ కోరుకుంటేనే అతడికి ఛాన్స్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement