ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్-2 పోరుతో కలిపి ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను ఓడించిన రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లో బెర్తు దక్కించుకోవడం కోసం క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.
ఇందులో గెలిచిన జట్టు మే 31న (ఆదివారం) జరగనున్న ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది ఏఐ ప్లాట్ఫామ్ క్లాడ్ అంచనా వేసింది. క్వాలిఫయర్-2లో విజేతతో పాటు టైటిల్ గెలుచుకోనున్న జట్టును కూడా అంచనా వేసింది. ఏఐ మాయతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్న ఈ రోజుల్లో అది చెప్పిన జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి.
క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు దూసుకెళ్తుందని అంచనా వేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఆర్సీబీ చేతిలో చతికిలపడి గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఆర్సీబీ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవనుందని, ఆ జట్టుకే గెలుపు అవకాశాలు 65 శాతం ఉన్నట్లు తెలిపింది. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా పక్కాగా వివరించింది.
ఈ సీజన్లో ఆర్సీబీ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తూ ఆరంభం నుంచే విజయాలు సాధించి మెరుగైన రన్రేట్తో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. కోహ్లి, పాటిదార్, పడిక్కల్, టిమ్ డేవిడ్లతో కూడిన బలమైన లైనప్కు తోడు భువనేశ్వర్, హాజిల్వుడ్, రసిక్ సలామ్ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉందని తెలిపింది.
అదీగాక క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ను భారీ తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో బరిలోకి దిగనుందని, అదే ఆత్మవిశ్వాసంతో గుజరాత్ను మరోసారి ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకోనుందని తెలిపింది. మరి ఏఐ చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.


