ATA Convention 2024: అదరహో అన్నట్టుగా సాగుతున్న ‘ఆటా’ ఆటల పోటీలు | ATA Convention 2024: Sports Games A True Celebration of Skill Sportsmanship Details Here | Sakshi
Sakshi News home page

ATA Convention 2024: అదరహో అన్నట్టుగా సాగుతున్న ‘ఆటా’ ఆటల పోటీలు

May 27 2024 12:22 PM | Updated on May 27 2024 12:34 PM

ATA Convention 2024: Sports Games A True Celebration of Skill Sportsmanship Details Here

కన్వెన్షన్ అంటే సాంస్కృతిక, నృత్య, సాహిత్య, సంగీత కలాపాలు, కొత్త పరిచయాలు, ప్రముఖ వ్యక్తుల సందడి, మంచి ఆహారం, జ్ఞానాన్ని పెంపొందించే సదస్సుల వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాల సమూహం. ఈ ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు మామూలు వాళ్ళు కాదండోయ్.. ఆటపాటలతో పాటు ఆరోగ్యమే మహా భాగ్యమన్న రీతిలో అమెరికాలోని పలు నగరాలలో మెగాఆటా కన్వెన్షన్(18వ) నిర్వహించనుంది.

యూత్ కాన్ఫరెన్స్‌లో భాగంగా అసాధారణమైన ప్రతిభ, క్రీడాస్ఫూర్తి, సమాజ స్ఫూర్తిని ప్రదర్శించే థ్రిల్లింగ్ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొన్న వారికి.. అదే విధంగా ప్రేక్షకులకు చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తోంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్స్, క్రికెట్, చెస్ వంటి పురుషులు / బాలురు మరియు మహిళలు / బాలికల కోసం చేస్తున్న వివిధ క్రీడలు వైవిధ్యభరితంగా, ఉత్సాహ పూరితంగా సాగడం ఆటా వారి బహుముఖ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఈ కన్వెన్షన్‌ ఈవెంట్‌ జూన్‌ 7న మొదలుకానుంది. అందరూ ఆహ్వానితులే, మరిన్ని వివరాలకు, టికెట్లకు www.ataconference.org ని సందర్శించాలని ఆటా తెలిపింది.

కాగా ఆటా స్పోర్ట్స్ టీమ్ నేతృత్వంలో సువానీలోని ఏబిసి సెంటర్‌లో జరిగిన ఆటా బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టోర్నమెంట్‌లో వివిధ విభాగాల్లో దాదాపు 160 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఓపెన్ సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో పోటీ తీవ్రంగా ఉండటం క్రీడాస్ఫూర్తిని మరింత పెంచింది.

ఇక షేఖరాగ్ పార్క్‌లో జరిగిన క్రికెట్‌ టోర్నమెంట్ సరే సరి.. అధిక సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొనడం.. మునుపెన్నడూ లేనన్ని జట్లు ముందుకు రావడం వల్ల ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

అదే విధంగా... పలు రాష్ట్రాల నుండి దాదాపు 200 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొన్న చదరంగం టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది చెస్ట్రోనిక్స్ ద్వారా సులభతరం చేయబడింది. ఆటా కన్వెన్షన్‌లో భాగంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఫౌలర్ పార్క్ రెక్ సెంటర్‌లో జరిగిన ఆటా మహిళల పికిల్ 8బాల్ టోర్నమెంట్ అన్ని ఈవెంట్‌లలోకి హైలైట్‌ అని చెప్పవచ్చు. నీతూ చౌహాన్ నేతృత్వంలో ఆటా మహిళా స్పోర్ట్స్ టీమ్ నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాలు అన్ని స్కిల్ లెవెల్స్ ప్లేయర్‌లకు జరిగాయి.

ఆటా మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విభిన్న నేపథ్యాలు మరియు నైపుణ్య స్థాయిల క్రీడాకారులను ఒకచోట చేర్చింది. ఈ ఈవెంట్ ప్రారంభ మరియు మధ్య స్థాయిలలో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలను కలిగి ఉంది, పాల్గొన్న వారికి వ్యక్తిగతంగా, జట్టులో భాగంగా పోటీ చేసే అవకాశాన్ని అందించింది.

స్పోర్ట్స్ కమిటీ ఛైర్ అనంత్ చిలుకూరి, ఉమెన్స్ స్పోర్ట్స్ ఛైర్ నీతూ మాట్లాడుతూ.. ‘‘ ఇటీవలి స్పోర్ట్స్ ఈవెంట్‌ల విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాళ్ల ప్రతిభ, క్రీడాస్ఫూర్తి స్థాయి నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ ఈవెంట్‌లను అద్భుతంగా విజయవంతం చేసినందుకు క్రీడాకారులు, నిర్వాహకులు, వాలంటీర్లు, స్పాన్సర్‌లతో సహా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటివి మున్ముందు మరిన్ని జరగబోతున్నాయి’’ అని తెలిపారు.

కాగా స్పోర్ట్స్ కమిటీలు, రీజనల్ కోఆర్డినేటర్లు అనంత్ చిలుకూరి, నీతూ చౌహాన్, శ్రీకాంత్ పాప, వెంకట్ రోహిత్, రంజిత్ చెన్నాడి, హరికృష్ణ సికాకొల్లి, సుభాష్ ఆర్ రెడ్డి, , శ్రీనివాస్ పసుపులేటి, సతీష్ రెడ్డి అవుతు, దివ్య నెట్టం, సరిత చెక్కిల, వాసవి చిత్తలూరి వంటి ఎంతో మంది అంకితభావం మరియు కృషి వల్లే సాధ్యమైంది. ఖచ్చితమైన ప్రణాళిక మరియు పకడ్బందీగా అమలు చేయడం వల్ల అందరికీ గొప్ప అనుభూతిని మిగులుస్తోంది.

ఆటా కాన్ఫరెన్స్ బృందం భవిష్యత్తులో మరింత ఆకర్షణీయమైన మరియు పోటీతత్వ స్పోర్ట్స్ ఈవెంట్‌లను నిర్వహించడం, సంఘంలో స్నేహపూర్వక మరియు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. బహుమతుల పంపిణీ కన్వెన్షన్ లో విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో, భారీ జనసందోహం ముందు జరగబోతున్నది. అలానే, ఆటా వారు అందరికీ స్నాక్స్, బెవరేజెస్ మరియు భోజనం అందించారు. అందరూ తప్పకుండా రండి, కలిసి మెలిసి మన ఆటా కన్వెన్షన్ ని ఆడుతూ, పాడుతూ జరుపుకుందామని ఆటా పిలుపునిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement