
బ్రిస్బేన్: 32 ఏళ్లుగా గబ్బా స్టేడియంలో ఓటమే ఎరుగని ఆస్ట్రేలియా జట్టును టీమిండియా కంగారుపెట్టించింది. 328 రికార్డు లక్ష్యాన్ని ఛేదించి అటు టెస్టును ఇటు సిరీస్ను ఎగరేసుకుపోయింది. కీలక ఆటగాళ్లు గాయాల గండంలో చిక్కుకున్నా అద్వితీయమైన ఆటతో రహానే సేన సగర్వంగా రెండోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముద్దాడింది. ఆసమయంలో 130 కోట్ల భారతీయుల గుండె ఉప్పొంగింది. దాంతోపాటు ఇతర దేశాల క్రికెట్ అభిమానులు, క్రీడా విశ్లేషకులు టీమిండియా పోరాటపటిమను కొనియాడారు. ఆసీస్ ఆటగాళ్లు, కోచ్ సైతం ఇండియన్ క్రికెటర్లను తక్కువ అంచనా వేయొద్దని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో పేర్కొన్నారు. ఈక్రమంలో తమ జట్టు ఓటమిపాలైనప్పటికీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ అభిమాని టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
(చదవండి: 'గాబా’ మైదానంలో కొత్త చరిత్ర..)
గబ్బా స్టేడియంలో అభిమానుల గ్యాలరీ నుంచి ‘భారత్ మాతాకి జై’, ‘వందే మాతరం’ అంటూ స్లోగన్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కాగా, బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టీమిండియా మూడు వికెట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 369 పరుగులు చేయగా.. భారత్ 336 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 294 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో లభించిన 33 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్ ఓవరాల్గా భారత్ ముందు 328 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. శుభ్మన్ గిల్ (146 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (211 బంతుల్లో 56; 7 ఫోర్లు), రిషభ్ పంత్ (138 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించి భారత్కు విజయాన్ని అందించారు.
(చదవండి: కరోనా : సానియా మీర్జా భావోద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment