
17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ శుభారంభం చేసింది. పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో 74 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. సంచలనం అని ఎందుకన్నామంటే.. అసలు ఫలితం రాదనుకున్న మ్యాచ్లో ఇంగ్లండ్ అద్భుతం చేసిందనే చెప్పొచ్చు. జీవం లేని పిచ్పై బ్యాటర్లు పండగ చేసుకున్న వేళ ఇక పేలవ డ్రా అనుకున్న దశలో ఆట ఆఖరిరోజు అసలు సిసలు టెస్టు మ్యాచ్ మజాను రుచి చూపించారు ఇంగ్లండ్ బౌలర్లు.
రావల్పిండిలోని పూర్తి బ్యాటింగ్ పిచ్పై జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 74 రన్స్ తేడాతో ఎవరూ ఊహించని విజయం సాధించింది. పాకిస్థాన్ గడ్డపై ఇంగ్లండ్ ఓ టెస్ట్ మ్యాచ్లో గెలవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. 343 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో 268 రన్స్కు ఆలౌటైంది. ఒక దశలో పాక్ టార్గెట్ దిశగా దూసుకెళ్లి ఇంగ్లండ్ను భయపెట్టింది. ఇమాముల్ హక్ (48), అజర్ అలీ (40), సాద్ షకీల్ (76), మహ్మద్ రిజ్వాన్ (46), అఘా సల్మాన్ (30)లాంటి వాళ్లు పోరాడినా ఫలితం లేకపోయింది.
పాకిస్థాన్ చివరి జోడీ నసీమ్ షా, మహ్మద్ అలీ పదో వికెట్ పడకుండా చాలాసేపు అడ్డుకున్నారు. 8.5 ఓవర్ల పాటు పోరాడి మ్యాచ్ను డ్రాగా ముగించడానికి ప్రయత్నించారు. ఓవైపు ఓవర్లు కరిగిపోతుండటంతో ఇంగ్లండ్ అన్ని విధాలుగా చివరి వికెట్ తీయడానికి ప్రయత్నించింది. చివరికి స్పిన్నర్ లీచ్.. నసీమ్ షా (6)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.
ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 657 పరుగులు చేసింది. ఇంగ్లండ్ నుంచి నలుగురు బ్యాటర్లు శతకాలతో చెలరేగారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా చెలరేగింది. పాక్ బ్యాటర్లలో ముగ్గురు సెంచరీలతో కథం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 579 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్కు 78 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ను ఇంగ్లండ్ 7 వికెట్లకు 264 పరుగుల వద్ద డిక్లేర్ చేసి పాకిస్థాన్ ముందు 342 పరుగుల టార్గెట్ను ఉంచింది. ఫ్లాట్ పిచ్ కావడంతో పాకిస్థాన్ ఒక దశలో లక్ష్యం దిశగా సాగినట్లు అనిపించింది. అయితే కీలక సమయాల్లో ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు పడగొట్టి పాక్పై ఒత్తిడి పెంచారు. మరో 8 ఓవర్లలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న దశలో జాక్ లీచ్ నసీమ్ షాను ఔట్ చేయడంతో ఇంగ్లండ్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్ నాలుగేసి వికెట్లు తీశారు. రావల్పిండిలాంటి బ్యాటింగ్ పిచ్పై 20 వికెట్లు తీసి మ్యాచ్ను గెలిపించడం ఇంగ్లండ్ బౌలర్లకే చెల్లింది. అయితే ఈ మ్యాచ్ మలుపులు తిరుగుతూ.. చివరి సెషన్లో ఇలాంటి ఫలితం ఇవ్వడం టెస్టు మ్యాచ్ మజాను అభిమానులు ఆస్వాధించినట్లయింది. ఈ విజయంతో ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 9 నుంచి 13 వరకు ముల్తాన్ వేదికగా జరగనుంది.
చదవండి: FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు!
The final wicket to fall.
— Pakistan Cricket (@TheRealPCB) December 5, 2022
Well played, @englandcricket#PAKvENG | #UKSePK pic.twitter.com/Rq3zFvPJSp
Comments
Please login to add a commentAdd a comment