ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వచ్చాకా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు ఏఐను తప్పుడు సంకేతాలకు వాడడం అలవాటుగా మార్చుకున్నారు. తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది.
ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్కు సంబంధించిన ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ వద్దకు వచ్చిన పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన హర్మన్ప్రీత్ ఆమె గొంతు పట్టుకొని నెట్టేసింది. దీంతో అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దరిని విడదీయడం వీడియోలో కన్పించింది.
ఇది చూసిన కొంతమంది అభిమానులు మ్యాచ్లో ఇంత పెద్ద గొడవ ఎప్పుడు జరిగిందా అని రిప్లేల మీద రిప్లేలు చూశారు. నిజానికి మ్యాచ్లో ఎక్కడా గొడవ జరిగిన దాఖలాలు లేవు. అయితే కొందరు ఆకతాయిలు ఏఐ మాయతో పాత వీడియో క్లిప్పింగ్లను జత చేర్చి ఈ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఇదీ అసలు సంగతి. అయితే ఐసీసీ ఈ ఫేక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి ఫేక్ వీడియోల వల్ల ఆటకు ఉండే క్రీడాస్ఫూర్తి దెబ్బతింటుందని, ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని కఠినంగా హెచ్చరించింది. అయితే భారత ఇన్నింగ్స్ సమయంలో జెమీమా రోడ్రిగ్స్ ఔటైన సమయంలో మాత్రం పాక్ ప్లేయర్లు కాస్త ఓవరాక్షన్ చేశారు. తస్మియా రుబాబ్ బౌలింగ్లో రోడ్రిగ్స్ మిడాన్ దిశగా షాట్ ఆడింది. అయితే అక్కడే ఉన్న నటాలియా పెర్వాయిజ్ క్యాచ్ అందుకుంది.
ఈ క్రమంలో పాక్ ఫీల్డర్ శ్రుతి మించి రోడ్రిగ్స్ నడుచుకుంటూ వెళుతున్న తరుణంలో ఆమెను చూస్తే బంతిని బలంగా నేలకేసి కొట్టడం వివాదంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని నిర్ణయించిన బీసీసీఐ నిన్నటి మహిళల మ్యాచ్లోనూ దానిని కంటిన్యూ చేసింది.
మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మంధాన (68), రిచా (34), హర్మన్ ప్రీత్ (36) రాణించారు. అనంతరం పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది.


