Photo Credit: Twitter
శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ను టీమిండియా 1-0తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టులో విజయానికి చేరువగా వచ్చినప్పటికీ, ఆట చివరి రోజు నాలుగు వికెట్లు తీయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. దీంతో లంక మ్యాచ్ను డ్రా చేసుకోగా, భారత్కు విజయం చేజారింది.
ఈ విషయం పక్కనబెడితే, శ్రీలంకతో టెస్టు సిరీస్లో టీమిండియా బౌలర్లు నోబాల్స్ ఎక్కువగా వేశారు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత ఎక్కువగా నోబాల్స్ నమోదైన టెస్టు సిరీస్ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం సునీల్ గావస్కర్ టెస్టుల్లో నోబాల్స్ను కంట్రోల్ చేసేందుకు ఫ్రీహిట్ లాంటిది సరిపోవని, మరేదైనా కఠిన రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
గావస్కర్ మాట్లాడుతూ.. "టెస్టు క్రికెట్లో బ్యాటర్లకు పరుగులు చేయడం ఇప్పటికే చాలా సులభంగా మారింది. ఓవర్కు రెండు బౌన్సర్ల పరిమితి, బౌండరీ లైన్లను దగ్గరకు జరపడం వంటివి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రీ హిట్లు ప్రవేశపెట్టి బ్యాటింగ్ను మరింత సులభతరం చేయొద్దు. నో బాల్స్ వేయకుండా ఉండటం అనేది పూర్తిగా ఆటగాళ్ల నియంత్రణలో ఉండే అంశం. టేప్ మెజర్తో రనప్ మార్క్ చేసుకునే ఈ ఆధునిక రోజుల్లో ఇలాంటి పొరపాట్లకు క్షమాపణలు ఉండవు" అని చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా టెస్టుల్లో నోబాల్స్ సమస్యను తప్పించుకోవడానికి గవాస్కర్ పలు కీలక సూచనలు చేశాడు."నో బాల్ వేసిన ఆటగాడికి భారీ జరిమానా విధించాలి. అదే తప్పు మళ్లీ పునరావృతం చేస్తే ఆ జరిమానాను రెట్టింపు చేయాలి. అంతటితో ఆగకుండా, ఆటగాడి జరిమా నాలో సగం మొత్తాన్ని బౌలింగ్ కోచ్కు కూడా విధించాలి. అప్పుడే బాధ్యత పెరుగుతుంది" అని అన్నాడు.
ఈ జరిమానాల ద్వారా వసూలైన మొత్తంతో సిరీస్ చివరలో టీమ్ సభ్యులందరికీ డిన్నర్ ఏర్పాటు చేయవచ్చని, ఇది జట్టులో బంధాన్ని మరింత పెంచుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 2021 నుంచి టెస్టుల్లో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 85 కంటే ఎక్కువ నోబాల్స్ వేసి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దీనిలో భాగంగానే సునీల్ గావస్కర్ తాజాగా నోబాల్స్ వ్యవహారంపై సీరియస్గా స్పందించాడు.


