#Dhoni: కమిన్స్‌కు ‘షాకిచ్చిన’ ప్రేక్షకులు.. అట్లుంటది ధోనితోని! | 'As Loud As I've Ever Heard': Pat Cummins over Hyderabad crowd chants Dhoni - Sakshi
Sakshi News home page

#Dhoni: అట్లుంటది ధోనితోని!.. కమిన్స్‌కు ‘షాకిచ్చిన’ ప్రేక్షకులు

Published Sat, Apr 6 2024 11:30 AM

Hyd Crowd Chants Dhoni Grand Entry Cummins As loud As Ive Ever Heard - Sakshi

IPL 2024- SRH vs CSK- Dhoni Entry Viral Video: మహేంద్ర సింగ్‌ ధోని.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్‌.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు హైదరాబాద్‌ ప్రేక్షకులు. తలా మైదానంలో అడుగుపెట్టగానే ఆరెంజ్‌ ఆర్మీ సైతం ధోని నామస్మరణతో అభిమానం చాటుకుంది.

ఇక సీఎస్‌కే ఫ్యాన్స్‌ తమ జెండాలు రెపరెపలాడిస్తూ ధోనికి ఘన స్వాగతం పలికారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం ధోని ఆగమనాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఐపీఎల్‌-2024లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌- సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ అందమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి.

ఇక ధోని క్రేజ్‌ను చూసి సన్‌రైజర్స్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ ఆశ్చర్యపోయాడు. తమ సొంతమైదానంలో సీఎస్‌కే స్టార్‌కు ప్రేక్షకులు స్వాగతం పలికిన తీరును తాను ముందెన్నడూ చూడలేదన్నాడు. ధోని బ్యాటింగ్‌కు రాగానే.. మైదానం దద్దరిల్లిపోయిందని.. ఇంత వరకూ తాను అంత శబ్దం ఎప్పుడూ వినలేదంటూ ధోని క్రేజ్‌కు ఫిదా అయ్యాడు.

కాగా శుక్రవారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌.. సీఎస్‌కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్లో వికెట్‌పై పరుగులు తీసేందుకు చెన్నై బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు.

ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (12), రుతురాజ్‌ గైక్వాడ్‌(26) నిరాశపరచగా.. అజింక్య రహానే(35) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, శివం దూబే మాత్రం(24 బంతుల్లో 45) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.

ఐదో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా(23 బంతుల్లో 31) నాటౌట్‌గా నిలవగా.. ఏడో స్థానంలో డారిల్‌ మిచెల్‌(13) దిగడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, నటరాజన్‌ బౌలింగ్‌లో మిచెల్‌ అవుట్‌ కాగానే ధోని ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్‌ సంబరాలు అంబరాన్నంటాయి.

తలా అలా గ్రౌండ్‌లో అడుగుపెట్టగానే కేరింతలతో ఉప్పల్‌ స్టేడియం ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ధోని ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సీఎస్‌కే 165 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్‌ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఏదేమైనా ధోని ఎంట్రీ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. 

వైజాగ్‌లో వింటేజ్‌ ధోని విధ్వంసం
విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఐపీఎల్‌-2024లో ధోని తొలిసారి బ్యాటిం‍గ్‌ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు రాబట్టాడు.

చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్‌ పక్కన ఎవరీ అమ్మాయి?

Advertisement
 
Advertisement