Ind vs Eng 3rd Test: భరత్‌నే ఆడించండి.. అతడు వద్దు! | Ind vs Eng Bharat Deserves 1 More Chance: Aakash Chopra On Dhruv Debut Report | Sakshi
Sakshi News home page

Ind vs Eng 3rd Test: అతడు వద్దు.. భరత్‌నే ఆడించండి!.. ఎందుకంటే..

Published Tue, Feb 13 2024 12:28 PM | Last Updated on Tue, Feb 13 2024 1:04 PM

Ind vs Eng Bharat Deserves 1 More Chance: Aakash Chopra On Dhruv Debut Report - Sakshi

India vs England, 3rd Test: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో శ్రీకర్‌ భరత్‌నే టీమిండియా వికెట్‌ కీపర్‌గా కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. బ్యాటింగ్‌ విషయాన్ని పక్కనపెడితే.. కీపర్‌గా భరత్‌ రాణిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తుచేశాడు.

పిచ్‌లు కఠినంగా ఉన్న కారణంగానే కేఎల్‌ రాహుల్‌ను వికెట్‌ కీపర్‌గా కాకుండా బ్యాటర్‌గా ఆడిస్తున్నారన్న ఆకాశ్‌ చోప్రా.. కాబట్టి భరత్‌ బ్యాటింగ్‌ వైఫల్యాన్ని భూతద్దంతో చూడద్దని విజ్ఞప్తి చేశాడు. కాగా సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్‌ కిషన్‌ మధ్యలోనే నిష్క్రమించడంతో మరోసారి ఆంధ్ర క్రికెటర్‌ టీమిండియాలో భాగమయ్యాడు.

ప్రొటిస్‌తో టెస్టుల తర్వాత ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఆడుతున్న సిరీస్‌లోనూ కీపర్‌గా భరత్‌కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో అతడు 69 పరుగులు చేశాడు. అయితే, సొంతమైదానం విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం భరత్‌ పూర్తిగా విఫలమయ్యాడు.

రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 23 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ధ్రువ్‌ జురెల్‌ అరంగేట్రానికి మేనేజ్‌మెంట్‌ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. భరత్‌ స్థానంలో వికెట్‌ కీపర్‌గా అతడికి ఛాన్స్‌ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా మాత్రం భరత్‌నే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ధ్రువ్‌ జురెల్‌ అరంగేట్రం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నా అభిప్రాయం ప్రకారం.. భరత్‌నే కొనసాగించడం మంచిది.

ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది రెండే టెస్టులు. అతడు వికెట్‌ కీపింగ్‌ బాగానే చేస్తున్నాడు. కానీ అందరూ అతడి బ్యాటింగ్‌ వైఫల్యాన్నే ఎత్తి చూపుతున్నారు. పిచ్‌లు కఠినంగా ఉంటాయనే కారణంగానే రాహుల్‌ను ప్యూర్‌ బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దించారు కదా.

మరి భరత్‌ను స్పెషలిస్టు కీపర్‌గానే చూడాలి కదా. హైదరాబాద్‌ టెస్టులో అతడు బ్యాటింగ్‌ కూడా బాగానే చేశాడు. అయినా కూడా.. బ్యాటర్‌గానే అతడి సేవలు కావాలనుకుంటే.. కనీసం మరొక్క మ్యాచ్‌లోనైనా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడే తొందరపడకూడదు’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది.

చదవండి: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్‌.. పో.. ఇక్కడి నుంచి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement