
Salman Butt Comments On Mumbai Indians: ఐపీఎల్-2021 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరకపోవడమే మంచిదైందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ లేదంటే, ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే కొత్త విజేతను చూడవచ్చని పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుర్తింపు పొందిన ఢిల్లీ క్యాపిటల్స్... 10 విజయాలతో ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై, బెంగళూరు ఉన్నాయి. ఇక బుధవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో భారీ విజయం ద్వారా కోల్కతా నైట్రైడర్స్ దాదాపు ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకున్నట్లే. డిఫెండింగ్ చాంపియన్ ముంబై శుక్రవారం నాటి మ్యాచ్లో సన్రైజర్స్పై 171 పరుగుల తేడాతో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్కు చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, దాదాపు అది అసాధ్యమే.
ఈ నేపథ్యంలో... సల్మాన్ భట్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘ముంబై ఇండియన్స్ ప్రమాదకరమైన జట్టు. ముందు ఓడినా సరే.. ఒక్కసారిగా వరుస విజయాలతో దూసుకువచ్చి... విజేతగా నిలవడం వారికి అలవాటు. కాబట్టి.. ఈసారి... వాళ్లు ప్లే ఆఫ్ చేరకపోవడమే మంచిదైంది. ఆర్సీబీ, డీసీ వంటి కొత్త జట్లను విన్నర్గా చూసే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా శుక్రవారం రెండు మ్యాచ్లు(ముంబై- హైదరాబాద్; బెంగళూరు- ఢిల్లీ) ఒకే సమయానికి(రాత్రి 7:30 గంటలకు) జరుగనున్న సంగతి తెలిసిందే.
చదవండి: Deepak Chahar: చహర్ ప్రేమాయణం.. భాభీ దొరికేసింది.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?!