ఏంట్రా ఈ బ్యాటింగ్‌?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. రియాక్షన్‌ వైరల్‌ | IPL 2024 Angry Kohli Shows Extreme Frustration As SRH Rip Apart RCB Viral | Sakshi

#RCBvsSRH: ఏంట్రా ఈ బ్యాటింగ్‌?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. వీడియో వైరల్‌

Apr 16 2024 12:50 PM | Updated on Apr 16 2024 1:34 PM

IPL 2024 Angry Kohli Shows Extreme Frustration As SRH Rip Apart RCB Viral - Sakshi

ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. రియాక్షన్‌ వైరల్‌(PC: Jio Cinema)

‘‘నేను కొడితే అదోలా ఉంటుందని..ఆళ్లూ.. ఈళ్లూ చెప్పడమే గానీ.. నాకు కూడా తెలియదు.. ఇప్పుడు మీకు తెలుస్తుంది’’.. బిజినెస్‌మేన్‌ సినిమాలో మహేశ్‌ బాబు చెప్పిన మాదిరే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు కూడా ఆర్సీబీ బౌలింగ్‌ను చితక్కొట్టారు.

ఏమాత్రం కనికరం లేకుండా బెంగళూరు బౌలర్లపై విరుచుపడుతూ చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కో..డితే సిక్స్‌.. లేదంటే ఫోర్‌.. తగ్గేదేలే అన్నట్లు ట్రావిస్‌ హెడ్‌(41 బంతుల్లో 102) ఓవైపు ఊచకోత కోస్తుంటే మరోవైపు హెన్రిచ్‌ క్లాసెన్‌(31 బంతుల్లో 67) ఛాన్స్‌ వచ్చినప్పుడల్లా వీరబాదుడు బాదాడు.

వీరిద్దరి తుఫాన్‌ ఇన్నింగ్స్‌ చూసి ఆరెంజ్‌ ఆర్మీ కేకలతో స్టేడియం హోరెత్తిపోగా.. ఆర్సీబీ ఫ్యాన్స్‌ మాత్రం జరుగుతున్న పరుగుల విధ్వంసాన్ని చూడలేక తమలో తామే మదనపడిపోతూ సతమతమయ్యారు.

అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. మరి ఆర్సీబీ బౌలర్లు, ఫీల్డర్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? వికెట్‌ తీయడం సంగతి దేవుడెరుగు.. ముందు పరుగుల ప్రవాహానికి కట్టడి చేయడం ఎలా అని తలలు పట్టుకున్నారంతా! 

కాలితో తంతూ ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి
ఇక ఆర్సీబీ ముఖచిత్రంగా భావించే స్టార్‌ విరాట్‌ కోహ్లి అయితే తీవ్ర అసహానికి లోనయ్యాడు. రైజర్స్‌ బ్యాటర్లు తమ సొంత మైదానంలో దుమ్ములేపుతుంటే అస్సలు చూడలేకపోయాడు. ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేక బౌలర్లు చేతులెత్తేస్తుంటే గాల్లోకి కాలితో పంచ్‌లు విసురుతూ కోపాన్ని వెళ్లగక్కాడు.

అదే సమయంలో వికెట్‌ పడినప్పుడల్లా జట్టును ఉత్సాహపరుస్తూ.. చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ పూర్తయ్యేంత వరకు కోహ్లి ఇచ్చిన వైవిధ్యమైన ఎక్స్‌ప్రెషన్స్‌, రియాక్షన్స్‌ చూసి ఫ్యాన్స్‌.. ‘‘అయ్యో పాపం ఆర్సీబీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆర్సీబీ బౌలర్లపై ఫ్యాన్స్‌ మండిపాటు
ఇలాగే ఆడితే ఆర్సీబీ ఈసారి కనీసం ప్లే ఆఫ్స్‌ కూడా చేరదంటూ ఆర్సీబీ బౌలర్లను పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. కాగా బెంగళూరులో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.

తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో తమ రికార్డును తామే బ్రేక్‌ చేసి.. అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. ఇక లక్ష్య ఛేదనలో కోహ్లి(42), ఫాఫ్‌ డుప్లెసిస్‌(28 బంతుల్లో 62) శుభారంభం అందించినా.. మిడిలార్డర్‌ పూర్తిగా విఫలమైంది.

ఇక ఆఖర్లో దినేశ్‌ కార్తిక్‌(35 బంతుల్లో 83) విధ్వంసకర అర్ధ శతకం బాదినా.. అనూజ్‌ రావత్‌(14 బంతుల్లో 25 నాటౌట్‌) మెరుపులు మెరిపించినా లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. ఫలితంగా 25 పరుగుల తేడాతో ఓడిపోయి వరుసగా ఐదో పరాజయం నమోదు చేసింది.

చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్‌, అగార్కర్‌ చర్చలు.. హార్దిక్‌ పాండ్యాకు నో ఛాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement