టిమ్ డేవిడ్ అనైతిక చ‌ర్య‌.. త‌గిన శాస్తి జ‌రిగింది! | IPL 2026 RCB Vs MI, BCCI Penalises RCB Tim David For Obscene Finger Sign During Match Against MI, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

టిమ్ డేవిడ్ అనైతిక చ‌ర్య‌.. త‌గిన శాస్తి జ‌రిగింది!

May 11 2026 7:46 PM | Updated on May 11 2026 8:04 PM

IPL 2026: BCCI Penalises RCB Tim David For Obscene Finger Sign Vs MI

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్ వ‌న్‌సైడ్ మ్యాచ్‌లో చ‌ప్ప‌గా సాగుతున్న వేళ ఆదివారం ఆర్సీబీ, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య మ్యాచ్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పించింది. అస‌లు సిస‌లు టీ20 మజాను చాలా రోజుల త‌ర్వాత రుచి చూపించింది. ఆఖ‌రివ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగిన పోరులో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజ‌యాన్ని న‌మోదు చేసింది. 

ఈ నేప‌థ్యంలో ఆర్సీబీ ఆట‌గాళ్లు డ‌గౌట్‌లో సంబ‌రాల్లో మునిగితేలారు. కానీ ఆర్సీబీ స్టార్ టిమ్ డేవిడ్ మాత్రం అనైతిక చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. ముంబై ఇండియ‌న్స్ ఓట‌మిని వెక్కిరిస్తూ టిమ్ డేవిడ్ ఆ జ‌ట్టుకు మిడిల్ ఫింగర్ చూపించ‌డం కెమెరాల‌కు చిక్కింది. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

తాజాగా టిమ్ డేవిడ్ చ‌ర్య‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన బీసీసీఐ అత‌ని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించ‌డంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ ఆర్టిక‌ల్ 2.6 ప్ర‌కారం అనుమ‌తి లేకుండా ఒక జ‌ట్టు లేదా వ్య‌క్తిని ఉద్దేశించి అస‌భ్య‌క‌ర‌మైన సంజ్ఞ చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. ఉల్లంఘ‌న చ‌ర్య కింద అత‌డిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. 

ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నిబంధనల కింద ఆ సంజ్ఞ అస‌భ్య‌క‌రంగా ఉండ‌డంతో పాటు వ్య‌క్తి లేదా జ‌ట్టును ఉద్దేశ‌పూర్వ‌కంగా అవ‌మా నించడం కింద‌కు వ‌స్తుంది. అందుకే అత‌డి మ్యాచ్ ఫీజులో జ‌రిమానా విధించ‌డంతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించాం’ అని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఇక టిమ్ డేవిడ్ ఆర్సీబీలోకి రాక‌ముందు ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 2022 నుంచి 2024 వ‌ర‌కు ముంబై త‌ర‌ఫున ఆడాడు. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో ధాటిగా బ్యాటింగ్ చేయ‌గ‌ల స‌త్తా టిమ్ డేవిడ్ సొంతం. ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున 37 మ్యాచ్‌లాడిన టిమ్ డేవిడ్ 171 స్ట్రైక్‌రేట్ 658 ప‌రుగులు సాధించాడు. 

2025 సీజ‌న్‌కు ముందు ఆర్సీబీలోకి వ‌చ్చిన టిమ్ డేవిడ్ ఆ సీజ‌న్‌లో లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో ఎక్కువ‌గా బ్యాటింగ్‌కు వ‌చ్చి 187 ప‌రుగులు చేశాడు. త‌ద్వారా ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. మ్యాచ్ విష‌యానికొస్తే ఆఖ‌రి ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు అవ‌స‌ర‌మైన ద‌శ‌లో రొమారియో షెప‌ర్డ్ ఔట్ అయ్యాడు. 

దీంతో స‌మీక‌ర‌ణం మూడు బంతుల్లో 10 ప‌రుగుల‌కు మారింది. ఈ ద‌శ‌లో భువ‌నేశ్వ‌ర్ సిక్స‌ర్ కొట్ట‌డంతో ఒక్క బంతికి రెండు ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ర‌సిక్ స‌లామ్ ఆఖ‌రి బంతికి రెండు ప‌రుగులు సాధించి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజ‌యాన్ని సాధించి పెట్టాడు. ఈ విజ‌యంతో ఆర్సీబీ 14 పాయింట్ల‌తో టేబుల్ టాప‌ర్‌గా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement