హర్మన్‌ సేనకు మిథాలీరాజ్‌ కీలక సూచన | Mithali Raj Suggests Change In-Batting-Order-India-Loss vs South Africa | Sakshi
Sakshi News home page

హర్మన్‌ సేనకు మిథాలీరాజ్‌ కీలక సూచనలు

Jun 22 2026 4:39 PM | Updated on Jun 22 2026 4:53 PM

Mithali Raj Suggests Change In-Batting-Order-India-Loss vs South Africa

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ పర్వాలేదని పించినప్పటికీ బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోవడం హర్మన్ సేన కొంపముంచింది. ఇక మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులకు సంబంధించి హర్మన్ సేనకు  పలు కీలక సూచనలు చేసింది.

జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీరాజ్ మాట్లాడింది. ‘భారత జట్టుకు ఇది చాలా నిరుత్సాహపరిచే గేమ్‌. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే హర్మన్ సేన పట్టికలో టాప్‌లో ఉండేది. కానీ ఇప్పుడు సెమీస్ రేసులో ఉండాలంటే బలమైన ఆస్ట్రేలియాను చిత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో పలు మార్పులు చేసుకుంటే ఆసీస్‌పై విజయం అంత కష్టమేమి కాకపోవచ్చు. 

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆమె తన పాత స్థానమైన నాలుగులో బ్యాటింగ్‌కు రావాలి.. ఆ స్థానంలో వస్తున్న జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో జెమిమా ఐదో స్థానంలో ఆడిన అనుభవముంది. స్పిన్నర్లను బాగా ఆడగలదనే పేరు కలిగిన జెమిమా ఐదో స్థానంలో బ్యాటింగ్ రావడం వల్ల, ఆ సమయానికి ఎక్కువగా స్పిన్నర్లను ఎదుర్కొనే అవకాశం వస్తోంది. 

దీనివల్ల ఆమె వేగంగా పరుగులు చేయగలదు. స్పిన్ బౌలింగ్‌లోనే జెమీమా స్కూప్స్‌, స్వీప్ షాట్లు కచ్చితంగా ఆడగలదు. మరోవైపు హర్మన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ రావడం వల్ల చివరి ఓవర్లలోనే ఆమె వేగంగా ఆడేందుకు ఆస్కారముంటుంది. ఇక బౌలింగ్‌లో శ్రీచరణి తన ప్రదర్శనతో అదరగొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఆడుతున్నప్పటికీ అక్కడి పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంలో విజయవంతమవుతోంది. 

తన బౌలింగ్‌లో పేస్ వైవిధ్యం కనిపిస్తోంది. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ వేస్తున్నశ్రీచరణి రాబోయే రోజుల్లో జట్టుకు కీలక బౌలర్‌గా మారనుంది.’ అని మిథాలీ చెప్పుకొచ్చింది. ఇక భారత జట్టు తమ తర్వాతి మ్యాచ్ జూన్ 25న (గురువారం) బంగ్లాదేశ్‌తో ఆడ‌నుంది. ఆ త‌ర్వాత జూన్ 28న (ఆదివారం) ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. ఈ రెండింట గెలిస్తే భార‌త్ నేరుగా సెమీస్‌లో అడుగుపెట్ట‌నుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా నెట్ ర‌న్‌రేట్ కీల‌కం కానుంది.

చదవండి: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement