‘మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా | Preity Zinta Left Fuming Over Distasteful Not Marrying Maxwell Question | Sakshi
Sakshi News home page

‘మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా.. దిమ్మతిరిగే కౌంటర్‌

May 14 2025 2:13 PM | Updated on May 14 2025 2:54 PM

Preity Zinta Left Fuming Over Distasteful Not Marrying Maxwell Question

గ్లెన్‌ మాక్స్‌వెల్‌తో ప్రీతి జింటా (Photo Courtesy: BCCI)

ప్రీతి జింటా (Preity Zinta).. కేవలం నటిగానే కాకుండా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ఫ్రాంఛైజీ పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమానిగానూ గుర్తింపు సంపాదించారు. ఐపీఎల్‌ వేలం సమయంలో ఆటగాళ్ల కొనుగోలు విషయంలో అనుసరించే వ్యూహాలలో భాగమయ్యే ప్రీతి.. స్టేడియంలో తమ జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరచడంలోనూ ముందే ఉంటారు.

ఇక ఐపీఎల్‌-2025 (IPL 2025)లో టైటిల్‌ దిశగా పంజాబ్‌ కింగ్స్‌ దూసుకుపోతుండటంతో ప్రీతి ఆనందంలో మునిగితేలుతున్నారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తన వ్యక్తిగత విషయాలతో పాటు, పంజాబ్‌ జట్టుకు సంబంధించిన విశేషాలను కూడా షేర్‌ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలో ఇటీవల ప్రీతి జింటాకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఎక్స్‌’ వేదికగా ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ సెషన్‌ నిర్వహించగా ఓ నెటిజన్‌ అనుచిత ప్రశ్నతో ప్రీతికి ఆగ్రహం తెప్పించాడు.

మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే..
పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ప్రదర్శనను ప్రీతితో ముడిపెడుతూ.. ‘‘మేడమ్‌.. మీరు మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే.. అతడు మీ జట్టుకు సరిగ్గా ఆడటం లేదు’’ అంటూ నీచంగా కామెంట్‌ చేశాడు. ఇందుకు ప్రీతి జింటా గట్టిగానే బదులిచ్చారు.

ఇదే ప్రశ్న వారినీ అడగగలవా? 
‘‘ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల పురుష యజమానులను కూడా నువ్వు ఇదే ప్రశ్న అడగగలవా? లేదా మహిళను కాబట్టి నా పట్ల ఇలా వివక్షపూరితంగా కామెంట్‌ చేస్తున్నావా?

క్రికెట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టేంత వరకు కార్పొరేట్‌ సెటప్‌లో మహిళలు ఎంతగా కష్టపడాల్సి వస్తుందో నాకసలు తెలియదు. నాకు తెలిసి నువ్వు ఏదో సరదా కోసమని ఇలా మాట్లాడి ఉంటావు.. కానీ దయచేసి ఇలా చెత్తగా ప్రవర్తించవద్దు.

గత పద్దెమినిదేళ్లుగా నేను కష్టపడి సంపాదించుకున్న పేరుకు కాస్త గౌరవం ఇవ్వండి. అందుకు నేను కచ్చితంగా అర్హురాలినే. ఇలా లింగవివక్షకు పాల్పడటం సరికాదు.. ధన్యవాదాలు’’ అంటూ ప్రీతి జింటా దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చారు.

ప్లే ఆఫ్స్‌ బెర్తు దాదాపుగా ఖాయం
కాగా కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకున్న పంజాబ్‌.. టైటిల్‌ లేని లోటును ఈసారి ఎలాగైనా తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికి 11 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడింట గెలిచింది. ప్రస్తుతం 15 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఇక ఇటీవల భారత్‌- పాకిస్తాన్‌ సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ధర్మశాలలో బ్లాక్‌ అవుట్‌ (విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం) విధించడంతో హుటాహుటిన స్టేడియాన్ని ఖాళీ చేయించాల్సి రాగా.. ప్రీతి జింటా కూడా తన వంతు సాయం చేశారు.

మరోవైపు.. ఐపీఎల్‌లో గతంలో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. ఐపీఎల్‌-2025లో తిరిగి జట్టుతో చేరాడు. అయితే, ఈసారి అతడి ప్రదర్శన అస్సలు బాగాలేదు. ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం 48 పరుగులే చేశాడు. ఇక గాయం కారణంగా మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.  

చదవండి: తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?: భారత మాజీ క్రికెటర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement