Photo Courtesy: IPL 2026
ఆస్ట్రేలియా క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్గా ఉన్న కమిన్స్ను ప్రైవేటు లీగ్లు ఆడకుండా జట్టుతోనే ఎక్కువగా అట్టిపెట్టుకోవాలని భావిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి మూడేళ్ల కాలానికి గాను 12 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 113 కోట్లు) అందించనుంది.
ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో పేర్కొంది. ఈ ఆఫర్కు కమిన్స్ ఓకే చెబితే మాత్రం ఏడాదికి 4 మిలియన్ డాలర్ల చొప్పున అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడడం మానేసి గ్లోబల్ టీ20 లీగ్ల్లో తమకు ప్రాతినిధ్యం వహించేందుకు ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ కమిన్స్కు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.62.22కోట్లు) ఆఫర్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కొత్త ఒప్పందం ప్రకారం కమిన్స్ ఆడే మ్యాచ్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం అందుతుంది. ప్రస్తుతం ప్రపం చవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్ల (ముఖ్యంగా బిగ్బాష్, ఐపీఎల్, ఎంఎల్సీ) హవా పెరిగిపోవడంతో, టాప్ క్లాస్ ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది.
ముఖ్యంగా ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్ను ఇతర లీగ్ల వైపు వెళ్లకుండా, కేవలం జాతీయ జట్టు అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మెగా డీల్ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ క్రికెట్ జేమ్స్ ఆల్సోప్ స్పందించారు. ‘కమిన్స్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను కాపాడుకోవడం మాకు అవసరం. మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) ఆడే పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ వంటి స్టార్లకు ఇప్పుడు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే వారిని ఇతర క్రికెట్ లీగ్లవైపు ఆకర్షణకు గురవ్వకుండా ఆస్ట్రేలియా క్రికెట్కు కట్టుబడి ఉండేలా చూడటం మా ప్రధాన లక్ష్యం’ అని వివరించారు.
ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పాట్ కమిన్స్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సీజన్కు లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కమిన్స్ తన విలువను చూపిస్తున్నాడు. సీజన్లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కమిన్స్ రెండు కీలక వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్పై విజయంతో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ టేబుల్ టాపర్గా నిలిచింది.


