రోహిత్ దెబ్బ‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మైండ్ బ్లాక్‌! | Rohit Sharma Hilarious Bluff Fools KL Rahul-Kuldeep Yadav IPL 2026 | Sakshi
Sakshi News home page

రోహిత్ దెబ్బ‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మైండ్ బ్లాక్‌!

Apr 5 2026 10:52 AM | Updated on Apr 5 2026 1:09 PM

Rohit Sharma Hilarious Bluff Fools KL Rahul-Kuldeep Yadav IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ చేసిన ఒక తుంటరి పనికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆట‌గాళ్లు కుల్దీప్ యాద‌వ్‌, కేఎల్ రాహుల్ మైండ్ బ్లాక్ అయింది. 

విష‌యంలోకి వెళితే.. ముంబై ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్ కుల్దీప్ యాద‌వ్ వేశాడు. కాగా కుల్దీప్ వేసిన బంతిని రోహిత్ స్వీప్ షాట్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ బంతి మిస్సయ్యి రోహిత్ ప‌క్క‌నుంచి వెళ్లి కీప‌ర్ కేఎల్ రాహుల్ చేతుల్లో ప‌డింది. అయితే కుల్దీప్ రోహిత్ చేతిని తాకి కీప‌ర్ చేతుల్లోకి ప‌డింద‌న్న అనుమానం క‌లిగి అంపైర్‌కు అప్పీల్ చేశాడు. 

ఇక్క‌డే రోహిత్ త‌న‌లోని తుంట‌రి చేష్ట‌ల‌ను బ‌య‌ట‌కు తీశాడు. తాను ఔట‌య్యానంటూ రోహిత్ డ‌గౌట్ వెళుతున్న‌ట్లు అంపైర్‌కు సైగ‌లు చేశాడు. కానీ అంపైర్ మాత్రం రోహిత్ ఔట్ అంటూ వేలు పైకి ఎత్త‌లేదు. అయితే రోహిత్ తాను ఔట్ అంటూ పెవిలియ‌న్ వైపు న‌డ‌వ‌డం చూసి కుల్దీప్‌, రాహుల్ డీఆర్ ఎస్ రివ్యూ కోరారు. దీంతో థ‌ర్డ్ అంపైర్ రివ్యూను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలోనే రోహిత్ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వాడు. 

ఎందుకంటే బంతి త‌న‌కు చాలా దూరంగా వెళ్లింద‌న్న విష‌యం రోహిత్‌కు తెలుసు. రిప్లేలో కూడా అదే క‌నిపించింది. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌న రివ్యూను వృథా చేసుకున్న‌ట్ల‌యింది. ఆ త‌ర్వాత రోహిత్ కుల్దీప్‌, రాహుల్ వైపు చూడ‌గా వారు చిరున‌వ్వుతో క‌నిపించారు. 

ముంబై ఇన్నింగ్స్ ముగిసిన అనంత‌రం రోహిత్ మ‌ట్లాడుతూ.. ‘కుల్దీప్ రివ్యూకు వెళ‌తాడ‌ని ముందే ఊహించాను. బంతి నాకు త‌గ‌ల్లేద‌ని నేను క్లియ‌ర్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. కుల్దీప్ 50-50 చాన్స్‌తో రివ్యూకు వెళ్లొచ్చ‌ని ఊహించాను.  నా అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని అలా చేశాను. అందుకే పెవిలియ‌న్‌కు వెనుదిరుగుతున్న‌ట్లు న‌టించాను. 

నాకు వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకోలేక‌పోయాను. మ‌రుస‌టి ఓవ‌ర్లోనే నా ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. కానీ కుల్దీప్‌, రాహుల్‌తో జ‌రిగిన‌ ఫ‌న్నీ మూమెంట్ ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ ఇన్నింగ్స్‌ను మంచి ఈజ్‌తోనే ప్రారంభించాడు. 

26 బంతుల్లో 35 ప‌రుగులు చేసిన హిట్‌మ్యాన్ అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. కెప్టెన్ సూర్య‌కుమార్ (51) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. అనంత‌రం ఢిల్లీ క్యాపిట‌ల్స్ 18.1 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. స‌మీర్ రిజ్వీ (90) సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో ఢిల్లీకి విజ‌యాన్ని అందించాడు.

చదవండి: మొద‌ట్లో చితక్కొట్టినా చివర్లో వ‌ణికించాడు!

Advertisement
 
Advertisement
Advertisement