
భాగ్యనగరం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు బిగ్షాక్ తగిలింది. టీమిండియాకు స్లో ఓవర్ రేట్ దెబ్బ పడింది. నిర్ణీత సమయం ముగిసేలోగా రోహిత్ సేన మూడు ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలడంతో మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీ జగవల్ శ్రీనాథ్ తెలిపారు.
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.22 ప్రకారం మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసేలోగా టీమిండియా మూడు ఓవర్లు తక్కువ వేసినట్లు తేలడంతో స్లో ఓవర్ రేట్గా పరిగణించినట్లు తెలిపారు. మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో మూడు ఓవర్ల చొప్పున ఒక్కో ఓవర్కు 20 శాతం కింద మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ పేర్కొంది. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన తప్పును అంగీకరించినట్లు వెల్లడించింది. దీంతో విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది.
ఇక మ్యాచ్లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భాగ్యనగరం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీతో మెరవడంతో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మైకెల్ బ్రాస్వెల్ మెరుపు శతకంతో రాణించి టీమిండియాను వణికించాడు. అయితే లోకల్ బాయ్ సిరాజ్ చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ 337 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్కు నాలుగు వికెట్లు దక్కాయి. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే రాయ్పూర్ వేదికగా శనివారం(జనవరి 21న) జరగనుంది.
చదవండి: రెండో వన్డేలోనూ ఉమ్రాన్కు నో ఛాన్స్! ఒకవేళ ఆడించినా..
Comments
Please login to add a commentAdd a comment