
ముంబై: టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్కు పెట్టింది పేరు. మైదానంలో పాదరసంలా కదులుతూ ఎన్నోసార్లు అద్భుతమైన క్యాచ్లు, రనౌట్లు చేశాడు. గతేడాది ఆసీస్తో జరిగిన సిరీస్లో అనూహ్యంగా గాయపడిన జడేజా ఆసీస్తో పాటు ఇంగ్లండ్ సిరీస్కు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కే తరపున బరిలోకి దిగిన జడ్డూ తన పవరేంటో రుచి చూపించాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 131 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో ఆరు వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక్క ఓవర్లోనే ఐదు సిక్సులు. ఒక ఫోర్ సహా మొత్తం 37 పరుగులు పిండుకొని చరిత్ర సృష్టించాడు. అంతేగాక సీఎస్కే ఆడిన మ్యాచ్ల్లో కొన్నిసార్లు తన మెరుపు ఫీల్డింగ్ కనబరిచాడు.
అయితే లీగ్కు కరోనా సెగ తగలడంతో బీసీసీఐ అనూహ్యంగా ఐపీఎల్ 14వ సీజన్ను రద్దు చేసింది. దీంతో ఆటగాళ్లంతా ఇంటికి చేరుకున్నారు. తాజాగా జడేజా తనకు ఇష్టమైన గుర్రపు స్వారీతో సరదాగా గడిపాడు. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన జడ్డూ.. '' నా రైడింగ్ స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకుంటున్నా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం జడేజా వీడియో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది.
ఇక జడేజా త్వరలో జరగబోయే ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు సన్నద్ధమవుతున్నాడు. ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన జట్టులో జడేజా చోటు సంపాదించాడు. టెస్టు చాంపియన్షిప్ అనంతరం ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్లోనూ జడేజా ఆడనున్నాడు. ఇక టీమిండియా జట్టు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనుంది. తాజాగా బుధవారం జట్టు మొత్తం 14 రోజుల పాటు కఠిన నిబంధనల మధ్య క్వారంటైన్లో ఉండనుంది. అనంతరం ఇంగ్లండ్కు వెళ్లిన తర్వాత మరో 10రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. ఇక జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా టీమిండియా, కివీస్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్నాయి. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: రిస్క్ తగ్గించుకుంటే మంచిది.. లేకుంటే కష్టమే
'ఆ నెంబర్ మరిచిపోలేదు.. అందుకే స్పందించాడు'
Comments
Please login to add a commentAdd a comment