
PC: ICC
T20 World Cup Final: టీ20 ప్రపంచకప్-2022 మొదటి సెమీ ఫైనల్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ను ఓడించగానే.. క్రికెట్ ప్రేమికుల్లో ఎక్కడా లేని ఉత్సాహం.. రెండో సెమీస్ మ్యాచ్లో గ్రూప్-2 టాపర్ టీమిండియా.. ఇంగ్లండ్ను చిత్తు చేయడం ఖాయమని.. తద్వారా ఫైనల్లో దాయాదుల హై వోల్టేజ్ మ్యాచ్ చూసే అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూశారు.
కానీ అడిలైడ్ వేదికగా గురువారం నాటి మ్యాచ్లో భారత జట్టు పరాజయం పాలు కావడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. ముఖ్యంగా భారత బౌలర్లు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకపోవడం.. టీమిండియా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి చెందడం తట్టుకోలేకపోయారు.
కనీస పోరాటం లేకుండానే ప్రత్యర్థి జట్టు ముందు తలొగ్గారంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. టీమిండియా- పాకిస్తాన్ ఫైనల్ ఆడితే చూడాలని.. 2007 నాటి సెంటిమెంట్ను రిపీట్ చేస్తూ భారత్ గెలవాలంటూ ఆకాంక్షిస్తే సెమీస్లోనే ఇంటికి బాట పట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
కాగా భారత్- పాక్ అంటేనే అంచనాలు ఎక్కువ. అది కూడా ఫైనల్లో తలపడితే ఆ మజానే వేరు. పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్ ఎనిమిదో ఎడిషన్లో ఇందుకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్పటికే ఫైనల్ మ్యాచ్కు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు చాలా మంది! కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వారి ఆశలపై నీళ్లు చల్లడంతో ఉసూరుమన్నారు.
దీంతో కొంతమంది ఫ్యాన్స్ ఇండియా- ఇంగ్లండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఫైనల్ వీక్షించేందుకు కొనుక్కున్న టిక్కెట్లు అమ్మేందుకు ప్రయత్నించినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 10 ఆస్ట్రేలియన్ డాలర్ల(మన కరెన్సీలో సుమారు 536 రూపాయలు)కే టిక్కెట్లు ఇచ్చేస్తామంటూ ఆవేదన, ఆగ్రహంతో కూడిన స్వరంతో వాళ్లు మాట్లాడటం అందులో వినిపించింది.
అయితే, ఇది పాక్ నెటిజన్ల పనేనని, కావాలనే ఇలాంటి వీడియోలు షేర్ చేస్తున్నారంటూ.. ఇంతకీ ఇది నిజమైందో కాదో అంటూ ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో భారత జట్టు ఓటమిపై మీమ్స్ ఆగటం లేదు.
అన్ని రకాలుగా దెబ్బే
ఆస్ట్రేలియాలో ఈ ఐసీసీ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ సహా సమీప దేశాల్లో ఉన్న చాలా మంది భారతీయులు మెల్బోర్న్లో నవంబరు 13న ఫైనల్ చూసేందుకు విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇండియా- పాక్ మ్యాచ్ అంటే వ్యూయర్షిప్ రికార్డులు, రేటింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. కానీ ఈ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు తలపడబోవడం లేదు కాబట్టి ఈ విధంగా కూడా బిజినెస్ దెబ్బ తినే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా రోహిత్ సేన ఫ్యాన్స్తో పాటు సగటు క్రికెట్ అభిమాని ఆశలన్నీ కల్లలు చేసింది. అయినా, ఆటలో గెలుపోటములు సహజమే! క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగటమే ముఖ్యం!
చదవండి: T20 WC 2022: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు రేసులో 9 మంది! కోహ్లితో పాటు: ఐసీసీ ప్రకటన
SuryaKumar Yadav: ఓటమి బాగా హర్ట్ చేసింది.. ఒక్కడివి ఏం చేయగలవు!
Fans who have already bought IND vs Pak final match tickets : pic.twitter.com/gqb0lElvLm
— Raghav Masoom (@comedibanda) November 11, 2022
Comments
Please login to add a commentAdd a comment