![Why Host Nation Name Missing From Asia Cup 2023 Logo Reason - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/1/indvspak2.jpg.webp?itok=mJJi0-AP)
టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ(PC: BCCI)
Asia Cup 2023- Pakistan- Sri Lanka: ఆసియా కప్-2023 టోర్నీ నేపథ్యంలో ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య జట్టు పేరు లేకపోవడం విమర్శలకు దారితీసింది. సాధారణంగా మేజర్ క్రికెట్ ఈవెంట్లలో ప్లేయర్లు ధరించే జెర్సీలపై హోస్ట్ పేరు కూడా ఉంటుంది. అయితే, ఈసారి ఆసియా కప్ విషయంలో మాత్రం ఇలా జరుగలేదు.
దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆసియా వన్డే కప్-2023 ఈవెంట్ ఆతిథ్య హక్కులు మొదట పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ ససేమిరా అనడంతో శ్రీలంక లైన్లోకి వచ్చింది.
కావాలనే చేశారంటూ ఉక్రోషం
భారత జట్టు ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరిగే విధంగా హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహణకు ఏసీసీ.. పీసీబీని ఒప్పించింది. ఈ నేపథ్యంలో ఆగష్టు 30 నుంచి ఈ వన్డే ఈవెంట్ ఆరంభమైంది. అయితే, ఆటగాళ్ల జెర్సీలపై లోగో మిస్ కావడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.
కావాలనే పాకిస్తాన్ పేరును మిస్ చేశారంటూ మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, మొహ్సిన్ ఖాన్ ఏసీసీపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఆటగాళ్ల జెర్సీలపై తమ లోగో లేకపోవడానికి గల కారణాన్ని వెల్లడించినట్లు ఎన్డీటీవీ పేర్కొంది.
అసలు విషయం ఇదీ!
అనధికారిక సంభాషణలో భాగంగా.. ఈ ఏడాది నుంచి ఆసియా క్రికెట్ మండలి కొత్త నిబంధనను తీసుకువచ్చిందని.. దాని ప్రకారం ఆతిథ్య జట్ల లోగోలు ఆటగాళ్ల జెర్సీలపై ఉండవని చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది.
ఇక నుంచి ఏ జట్టుకైనా ఇదే రూల్ వర్తిస్తుందని చెప్పినట్లు సమాచారం. కాగా ఆసియా వన్డే కప్ తొలి మ్యాచ్లో పాకిస్తాన్.. నేపాల్పై గెలవగా.. రెండో మ్యాచ్లో శ్రీలంక బంగ్లాదేశ్ను ఓడించింది.
చదవండి: Ind Vs Pak: మా భయ్యా ఎట్టకేలకు.. ఇక్కడ ఇలా.. షమీపై సిరాజ్ కామెంట్స్!
Comments
Please login to add a commentAdd a comment