
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్.. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై మరోసారి తన అక్కసు వెల్లగక్కాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య మరో 3 రోజుల్లో ప్రారంభంకానున్న మెగా పోరును దృష్టిలో ఉంచుకుని తన డ్రీమ్ జట్టును(ఇండియా) ప్రకటించాడు. ఈ జట్టులో దాదాపు అందరూ ఊహించినట్లుగానే ఆటగాళ్ల ఎంపిక జరిగినప్పటికీ.. ఆల్రౌండర్ల కోటాలో జడేజాకు బదులు హనుమ విహారిని ఎంపిక చేసి, జడేజాపై తన కోపాన్ని మరోసారి బహిర్గతం చేశాడు.
స్పెషలిస్ట్ స్పిన్నర్గా అశ్విన్కు ఓటేసిన ఆయన.. పార్ట్ టైమ్ స్పిన్నర్గా విహారిని పరిగణలోకి తీసుకున్నాడు. ఇందుకు ఆయన వివరణ కూడా ఇచ్చాడు. ఇంగ్లండ్లోని పరిస్థితుల దృష్ట్యా ఒకే స్పిన్నర్ అవసరం ఉంటుందని, అందుకే సీనియర్ అయిన అశ్విన్ను తీసుకుకున్నానని చెప్పాడు. మరోవైపు పేసర్ల కోటాలో సీనియర్ బౌలర్ ఇషాంత్ను కాదన్న ఆయన.. సిరాజ్ వైపు మొగ్గుచూపాడు. పేసర్ల కోటాలో షమీ, బుమ్రా, సిరాజ్లకు అవకాశమిచ్చాడు. ఆస్ట్రేలియాలో సిరాజ్ బంతిని బాగా స్వింగ్ చేశాడు కాబట్టే ఇషాంత్ స్థానంలో అతనికి అవకాశమిచ్చానని వివరణ ఇచ్చాడు.
కాగా, ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మలను ఎన్నుకున్న మంజ్రేకర్.. పుజారా, విరాట్ కోహ్లీ, రహానేలకు వరుసగా అవకాశం ఇచ్చాడు. విహారి రూపంలో అదనపు బ్యాట్స్మెన్ని జట్టులోకి తీసుకున్న ఆయన.. ఏడవ స్థానం కోసం రిషబ్ పంత్ను ఎంపిక చేశాడు. ఆల్రౌండర్ కోటాలో విహారి, జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్ని పరిగణలోకి తీసుకున్న ఆయన.. చివరకు విహారికే ఓటేశాడు.
మంజ్రేకర్ డ్రీమ్ ఎలెవెన్: శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, షమీ, బుమ్రా, మహ్మద్ సిరాజ్.
చదవండి: నాటి ప్రపంచ ఛాంపియన్.. నేడు ఛాయ్ అమ్ముకుంటున్నాడు
Comments
Please login to add a commentAdd a comment