
నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం
● వినియోగదారుల జేబులకు చిల్లు
● అడుగడుగునా అవకతవకలు
● నాణ్యతలేని సరుకుల విక్రయాలు
● కూరగాయలు, చేపల మార్కెట్లలో
ఇదీ పరిస్థితి
● అందుబాటులో లేని ధర్మకాటా
మోసాలు జరుగుతున్నాయి
నెల్లూరు (పొగతోట)/ నెల్లూరు అర్బన్/
నెల్లూరు (క్రైమ్)/ నెల్లూరు సిటీ: వస్తు కొనుగోలు సమయంలో వినియోగదారుల జేబులకు నిత్యం చిల్లు పడుతోంది. వ్యాపారుల స్వార్థం, అధికారుల పర్యవేక్షణ లేమి కారణంగా వినియోగదారులు అడుగడుగునా మోసపోతున్నారు. కూరగాయల మార్కెట్, పెట్రోలు బంకులు, నిత్యావసర సరుకుల దుకాణాలు, రోడ్లపై పండ్ల షాపులు ఇలా ప్రతిచోట వినియోగదారులు నష్టపోతున్నారు. తూకాలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు. సాక్షి బృందం శుక్రవారం పట్టణంలో పలుచోట్ల విజిట్ చేయగా అనేక విషయాలు బట్టబయలు అయ్యాయి. వినియోగదారులను నిత్యం మోసం చేయడమే పనిగా వ్యాపారులు కొత్త కొత్త ఆలోచనలకు రూపకల్పనలు చేస్తున్నారు. పెట్రోలు బంకుల్లో చిప్లు వాడడం, కూరగాయల మార్కెట్లలో ఎలక్ట్రానిక్ కాటాల్లో మోసాలకు పాల్పడడం నిత్యం తంతుగా మారిపోయింది. ప్రశ్నించిన వినియోగదారులపై దాడులకు దిగడం, బెదిరించడం పరిపాటి. నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్లో అడుగడుగునా మోసాల మయం అయిపోయింది. తనిఖీలు నిర్వహించి పర్యవేక్షించి వినియోగదారులు నష్టపోకుండా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో నెల మామూళ్లకు అలవాటుపడ్డ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చిన సమయంలో మినహా అధికారులు అటువైపుగా చూడడం లేదు. తూకాల్లో మోసపోకుండా ఉండేందుకు వినియోగదారుల కోసం ధర్మకాటాను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ సిబ్బంది అందుబాటులో ఉండాలి. వేయింగ్ మెషన్ అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం సిబ్బంది ఎవరూ లేక పోవడంతో వేయింగ్ మెషన్ను కిందపడేశారు. ధరల పట్టికలో వ్యత్యాసాలున్నాయి. నిత్యం కూరగాయల ధరలను పట్టికపై మార్పులు చేయాల్సి ఉంది. మార్కెటింగ్ అధికారులు పట్టించుకోక పోవడంతో బోర్డుపై ఒక ధర, వ్యాపారులు విక్రయించేది మరో ధరగా ఉంది.
కుళ్లిన సరుకుల మిక్సింగ్..
కూరగాయల మార్కెట్లో కుళ్లిన, పాడైపోయిన కూరగాయలను వినియోగదారులకు అంటగడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వినియోగదారులను చులకనగా మాట్లాడడం పరిపాటి అయిపోయింది. కేజీకి 100 గ్రాముల నుంచి 150 గ్రాములు తూకం తక్కువ, నాణ్యత లేని కూరగాయలను వినియోగదారులకు అంటగడుతున్నారు. నెల్లూరు నగరంలో పదిలక్షల జనాభా ఉంది. నగర ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో కూరగాయల మార్కెట్ను సందర్శిస్తారు. వారికి అవసరమైన కూరగాయలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. కుళ్లినవి, వాడిపోయినవి తూకం తక్కువగా అంటగడుతున్నారంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయ మార్కెట్లో వినియోగదారులు నష్టపోకుండా చూడాల్సిన అధికారులు ఫిర్యాదులు వస్తేనే స్పందిస్తున్నారు.
ఏమార్చి కవర్లు మార్చేస్తున్నారు
కొన్ని పండ్ల దుకాణాల్లో పండ్లు కొనుగోలు చేస్తే నిర్వాహకుడు, పనిచేసే వ్యక్తి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాము కొన్న కవర్ను పక్కన పెట్టి ముందుగా ఏర్పాటు చేసుకున్న కవర్ను ఏమాత్రం అనుమానం రాకుండా వినియోగదారునికి ఇస్తున్నారు. ఓ వినియోగదారుడు నగరంలోని ఓ పండ్ల దుకాణంలో నాణ్యత కల్గిన రెండు కేజీల యాపిల్ పండ్లు, కేజీ ద్రాక్ష, ఒక కేజీ దానిమ్మలు కొనుగోలు చేశారు. కస్టమర్ కొనుగోలు చేసే క్రమంలో దుకాణదారుడు యాపిల్ పండ్ల కవర్ను మార్చేశారు. నాణ్యతలేని పండ్లను కవర్లో ముందుగా ఉంచి కస్టమర్ను బోల్తా కొట్టించారు. వినియోగదారుడు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.
ఆదమరిస్తే జేబులకు చిల్లే
మార్కెట్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు అవసరం. ఆదమరిస్తే కవర్లు మార్చడం, తక్కువ తూకం వస్తువులు ఇస్తుంటారు. వినియోగదారుడు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. –ఎస్కే సమీర్, బుజబుజనెల్లూరు
వ్యాపారులు వినియోగదారులను నష్టపరుస్తున్నారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే చులకనగా మాట్లాడుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి వినియోగదారులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి
– రమణారెడ్డి, వినియోగదారుడు

నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం

నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment