కేజీ గంజాయికి వెయ్యి కమీషన్
● గంజాయి అక్రమ
రవాణా గుట్టురట్టు
● వివరాలు వెల్లడించిన కాశీబుగ్గ డీఎస్పీ
వెంకట అప్పారావు
వివరాలు వెల్లడిస్తున్న
కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు
కవిటి: ఒడిశా సరిహద్దు నుంచి ఆంఽధ్రప్రదేశ్లోకి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాలను ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నామని కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు తెలిపారు. కవిటి పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాజాగా పట్టుబడిన 10.250 కిలోల గంజాయికు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లా లాఠీ గ్రామానికి చెందిన సురేష్ నాయక్ తన స్నేహితుడు, గంజాయి వ్యాపారం చేసే రాజేంద్ర బాడిత్య సహకారంతో అక్రమ రవాణా వ్యాపారానికి అలవాటుపడ్డాడు. గంజాయిని తీసుకొని బెంగళూరులో తాను చెప్పిన మనిషికి అప్పగిస్తే కేజీకి రూ.1000 కమీషన్గా ఇచ్చేవాడు. ఈ క్రమంలో సురేష్ గురువారం రాజేంద్ర బాడిత్య నుంచి 10 కేజీల 250 గ్రాముల గంజాయిని తీసుకొని బరంపురం నుంచి బస్సులొ బయలుదేరి కొజ్జీరియా టోల్గేటు ముందు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద దిగాడు. అక్కడి నుంచి కంచిలి రైల్వే స్టేషనుకు వెళ్లేందుకు బస్సు కోసం నిరీక్షిస్తుండగా ముందస్తు సమాచారంతో కవిటి ఎస్ఐ వి.రవివర్మ తన సిబ్బందితో వెళ్లి సురేష్నాయక్ను అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నంనాయుడు, కవిటి ఎస్ఐ వి.రవివర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
కేజీన్నర గంజాయితో..
ఇచ్ఛాపురం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీమ్పట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన కొర్లపాటి వంశీ అనే యువకుడు కేజీన్నర గంజాయితో పట్టుబడినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. గురువారం ఇచ్ఛాపురం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితుడితో పాటు ఆదే గ్రామానికి స్నేహితులు కలపాటి తేజ, కుంచాల సూర్యలు గంజాయికి బానిసయ్యారు. అవసరమైనప్పుడలా ఒడిశా వచ్చి గంజాయిని కొనేవారు. ఈ క్రమంలో వంశీ గురువారం ఒడిశాలో కేజీ 540 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి బస్సులో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కి వస్తుండగా పట్టణ పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, పట్టణ ఎస్సై ముకుందరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
దుకాణాల్లో గంజాయి విక్రయం!
ఆమదాలవలస: పట్టణంలో ఇటీవల పలు దుకాణాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న ఒక దుకాణానికి మఫ్టీలో ఉన్న పోలీసు సిబ్బంది వెళ్లి గంజాయి కావాలని అడగ్గా.. పోలీసులని తెలియక నిర్వాహకురాలు గంజాయి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో దుకాణం నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమదాలవలస సీఐ సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా దుకాణాలు తనిఖీలు చేస్తున్నామని, ఎవరైనా పట్టుపడితే విలేకరుల సమావేశంలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment