మనోవేదనకు గురై.. 8 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి.. చివరికి | - | Sakshi

మనోవేదనకు గురై.. 8 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి.. చివరికి

Oct 8 2023 2:04 AM | Updated on Oct 8 2023 7:56 AM

- - Sakshi

మృతురాలు సత్యవతి (ఫైల్‌), అనాథలైన చిన్నారులు

సూర్యపేట్‌: మనోవేదనతో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భువనగిరి పట్టణ శివారులో శనివారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని రామ్‌నగర్‌ కాలనీలో నల్ల సత్యవతి(48) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటుంది. స్థానిక మదర్‌ థెరిస్సా స్కూల్‌లో పెద్ద కుమార్తె రిషిక 9వ తరగతి, నేహిత 8వ తరగతి చదువుతున్నారు.

ఐదేళ్ల క్రితం ఆమె భర్త వదిలేసి వెళ్లిపోవడంతో భువనగిరి పట్టణానికి చెందిన ఓ లాయర్‌ వద్ద పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. సత్యవతికి అంగవైకల్యం ఉండటం, భర్త వదిలేసి వెళ్లిపోవడం, సొంత ఇల్లు లేకపోవడం, పిల్లల భవిష్యత్తుకు భరోసా లేకపోవడం, కుటుంబ పోషణ భారం కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె 8 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భువనగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా శనివారం ఉదయం భువనగిరి శివారులోని జగదేవ్‌పూర్‌ రోడ్డులో రైల్వే ట్రాక్‌ వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఆధారంగా సత్యవతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తలకొరివి పెట్టిన చిన్న కుమార్తె..
భర్త వదిలేసి వెళ్లడంతో సత్యవతి భౌతికకాయానికి చిన్న కమార్తె నేహిత తలకొరివి పెట్టడం చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి లేక, తల్లి చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement