2వేల మందితో భారీ బందోబస్త్‌ | - | Sakshi
Sakshi News home page

2వేల మందితో భారీ బందోబస్త్‌

Published Thu, Feb 13 2025 7:51 AM | Last Updated on Thu, Feb 13 2025 7:51 AM

2వేల మందితో భారీ బందోబస్త్‌

2వేల మందితో భారీ బందోబస్త్‌

చివ్వెంల: మండలంలో దురాజ్‌పల్లి గ్రామంలో గల శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతరకు పటిష్ట భద్రత కల్పిస్తున్నామని, ఇందుకు 2వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న జాతర నేపథ్యంలో బుధవారం ఆయన పెద్దగట్టు పరిసరాలను కలియదిరిగి బందోబస్త్‌ ఏర్పాట్లు, జాతర రూట్‌ మ్యాపు, గ్లోబల్‌ మ్యాప్‌లను పరిశీలించారు. పార్కింగ్‌ ప్రదేశాలు, సిబ్బంది వసతి, జాతరకు వచ్చి పోయే మార్గాలు, బారికేడ్ల ఏర్పాట్లు, దేవస్థానం రక్షణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చిపోయే వాహనాల వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి–65పై వాహనాల మళ్లింపు ఉంటుందన్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ మీదుగా మళ్లిస్తామన్నారు. అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్‌నగర్‌, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా మళ్లిస్తామని పేర్కొన్నారు. ఇతర జిల్లాల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు దైవదర్శనం కల్పించేలా పోలీస్‌ సేవలను కూడా వినియోగించుకుంటున్నామన్నారు. జాతరలో 68 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అటాచ్‌ చేసి 24 గంటల పర్యవేక్షణ చేస్తామన్నారు. దొంగతనాలు జరగకుండా పోలీస్‌ స్పెషల్‌ టీమ్స్‌, క్రైమ్‌ కంట్రోల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక టీమ్‌ మఫ్టీలో తిప్పుతూ అనుమానితులను గుర్తించి, దొంగతనాలు జరగకుండా చూస్తామన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్‌ ఉంటుందని, సాధారణ భక్తుల్లాగా ప్రజల్లో కలిసిపోయి షీటీమ్‌ బృందం పనిచేయనుందన్నారు. జాతర ప్రదేశంలో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసర సమయంలో పోలీస్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెరువు నిండుగా ఉన్నందున చెరువు వైపు ఎవరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, డీఎస్‌పీ రవి, ఎస్‌బీ సీఐ నాగభూషణం, సీఐలు రాజశేఖర్‌, శ్రీను, రఘువీర్‌, వీరరాఘవులు, ఎస్‌ఐలు మహేశ్వర్‌, సాయిరామ్‌ శ్రీకాంత్‌, బాలు నాయక్‌, వీరయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పెద్దగట్టు జాతరకు పటిష్ట భద్రత

ఫ 68 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా

ఫ ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement