పెద్దగట్టు ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

పెద్దగట్టు ముస్తాబు

Published Sat, Feb 15 2025 1:53 AM | Last Updated on Sat, Feb 15 2025 1:48 AM

పెద్ద

పెద్దగట్టు ముస్తాబు

రేపటి నుంచి దురాజ్‌పల్లి శ్రీలింగమంతులస్వామి జాతర

జాతరకు 60 ప్రత్యేక బస్సులు

భానుపురి (సూర్యాపేట): చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీలింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతరకు భక్తుల సౌకర్యార్థం సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్‌ ఆర్టీసీ నల్లగొండ రీజినల్‌ మేనేజర్‌ కె.జానిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న తెల్లవారుజామున ప్రారంభమై ఈనెల 20 వరకు జాతర కొనసాగనుందని, ఈ ఐదు రోజుల పాటు ఈ బస్సుల ద్వారా జాతరకు ప్రయాణికులను చేరవేస్తాయని పేర్కొన్నారు. సూర్యాపేట నుంచి పెద్దగట్టు జాతరకు బస్సు టికెట్‌ ధర పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

చివ్వెంల(సూర్యాపేట): రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఈనెల 16 నుంచి 20 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో వివిధశాఖలకు కేటాయించిన పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆలయాన్ని రంగులతో ముసాబు చేశారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతున్న ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం నుంచి జాతర ప్రారంభం కానుండడంతో ఆలయ పరిసరాల్లో వివిధ దుకాణాలు వెలుస్తున్నాయి. భక్తుల కోసం జాయింట్‌ వీల్‌ (రంగుల రాట్నం), బ్రేక్‌ డ్యాన్స్‌, సర్కస్‌, హంస వాహనం, ఎగ్జిబిషన్‌ తదితర వినోద శాలలను ఏర్పాటు చేస్తున్నారు.

భక్తుల కోసం సౌకర్యాలు..

జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్‌ భగీరథ విభాగం ద్వారా తాగునీరు అందించేందుకు 14 ప్రదేశాల్లో నల్లాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయంతోపాటు పరిసరాల చుట్టూ 66 సీసీ కెమెరాలు అమర్చారు. చెరువు కట్టపై నడిచే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాత్రి వేళ వెలుతురు కోసం హైమాస్ట్‌ లైట్లు బిగించారు. తప్పి పోయిన చిన్నారులకు ప్రత్యేక శిబిరంతోపాటు భక్తులకు ఎండవేడిమి నుంచి రక్షణకు చలువ పందిర్లు ఏర్పాటు చేశారు.

వివిధ పనులకు నిధుల కేటాయింపు ఇలా..

జాతర నిర్వహణకు ప్రభుత్వం 70 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని దానిని చదును చేయించింది. ఇతర అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ఈసారి గుట్టపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, గుట్టకింద మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.1.67 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గుట్ట చుట్టూ హైమాస్ట్‌, టవర్‌ లైట్లకు రూ.35 లక్షలు కేటాయించారు. అలాగే జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు బారికేడ్ల నిర్మాణానికి రూ.12 లక్షలు, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాటుకు రూ.12 లక్షల నిధులు కేటాయించారు. ఇవేకాక, చెత్త తొలగింపునకు రూ.25 లక్షలు, నేల చదునుకు రూ.10 లక్షలు, ఆలయం చుట్టూ చెట్ల పొదలు తొలగించేందుకు రూ.8లక్షలు, తాగునీటి సరఫరాకు రూ.3లక్షలు, నీటి ట్యాంకర్ల కోసం రూ.5లక్షలు, గల్ఫర్‌ ద్వారా బుదర తరలించేందుకు రూ.4లక్షలు, సీసీ రోడ్ల మరమ్మతులకు రూ.5లక్షలు, జాతర స్టోర్‌ డస్ట్‌కు రూ.5 లక్షలు, గ్రావెల్‌ కోసం రూ.5లక్షలు కేటాయించారు. సీసీ కెమెరాలు, సోలార్‌ లైట్ల మరమ్మతులకు రూ.5లక్షలు, స్నానాలు చేసేచోట ప్లాట్‌ఫామ్‌, పైపులైన్‌ ఏర్పాటుకు రూ.9.30 లక్షలు, నీటి మోటార్స్‌, సింథటిక్‌ ట్యాంక్స్‌, హెచ్‌డీపీఓ పైపులైన్‌ కోసం రూ.5లక్షలు, కోనేరులో శివుడి విగ్రహం ప్రతిష్ఠించేందుకు రూ.3 లక్షలు, నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

ఫ అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

ఫ రంగులతో రూపుదిద్దుకున్న ఆలయం, సింహద్వారం

ఫ ఆలయం చుట్టూ చలువ పందిర్లు

ఫ పరిసరాల్లో వెలుస్తున్న దుకాణాలు

భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు

జాతర నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు, లైటింగ్‌, సివిల్‌ పనులు చేయించాం. జాతర ముగిసే వరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య సిబ్బంది, ప్రత్యేక అధికారులను అందుబాటులో ఉంచుతాం.

– బోళ్ల శ్రీనివాస్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, సూర్యాపేట

No comments yet. Be the first to comment!
Add a comment
పెద్దగట్టు ముస్తాబు 1
1/2

పెద్దగట్టు ముస్తాబు

పెద్దగట్టు ముస్తాబు 2
2/2

పెద్దగట్టు ముస్తాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement