
తమిళ సినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఆగస్టు 16, 1947. ఈ చిత్రం ద్వారా నటి రేవతి కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓం ప్రకాష్ బట్, నర్శీరామ్ చౌదరితో కలిసి దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించిన చిత్రం ఇది. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు ఎన్ఎస్ పొన్కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని సత్యం థియేటరో సోమవారం రాత్రి నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా నటుడు శివకార్తికేయన్ పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ... తనకు సీనియర్ నటుడు కార్తీక్ అంటే చాలా ఇష్టం అని, ఆయన చాలా స్వీటెస్ట్ పర్సన్ అని పేర్కొన్నారు. అదేవిధంగా గౌతమ్ కార్తీక్ను కలిసిన చాలా కాలం తర్వాత తాను కార్తీక్ను కలిశానని, ఆయన చాలా అందగాడని పేర్కొన్నారు. ఆయన నటనలో ఇతర ఏ నటుల ఛాయలు ఉండవని, అయితే తన నటనలో మాత్రం రజనీకాంత్ చాయలు ఉంటాయని శివకార్తికేయన్ పేర్కొన్నారు. కాగా తన పయనం దర్శకుడు ఏఆర్ మురుగదాస్తో ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రంతోనే మొదలైంది అన్నారు. అది ఏఆర్ మురుగదాస్కు నిర్మాతగా తొలి చిత్రమని తెలిపారు.
ఆ చిత్ర ప్రారంభోత్సవానికి తాను వ్యాఖ్యాతగా వ్యవహరించానన్నారు. ఆ తర్వాత ఆయన నిర్మించిన మాన్ కరాటే చిత్రంలో తాను కథానాయకుడిగా నటించానని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన నిర్మించిన ఈ చిత్రానికి తాను అతిథిగా విచ్చేశానని అదేవిధంగా త్వరలో మరో ఇంపార్టెంట్ స్టెప్పును వేయబోతున్నట్లు చెప్పారు. అది త్వరలోనే జరుగుతుందని అన్నారు. కాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment