మక్కలు కొంటాం: సీఎం కేసీఆర్‌ | CM KCR Review On Crop Cultivation Procedure | Sakshi
Sakshi News home page

మక్కలు కొంటాం

Published Sat, Oct 24 2020 2:27 AM | Last Updated on Sat, Oct 24 2020 2:28 AM

CM KCR Review On Crop Cultivation Procedure - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని సీఎం కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. క్వింటాల్‌కు రూ.1,850 మద్దతు ధర చెల్లించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయొద్దని ప్రభుత్వం కోరిందని, అయినా రైతులు మక్కలు సాగు చేశారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దంటే మక్కలు సాగు చేశారని, వాస్తవా నికి ప్రభుత్వానికి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదన్నారు. అయినా రైతులు నష్టపోవొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయిం చినట్లు ఆయన వెల్లడించారు. వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

గతేడాది రూ.845 కోట్ల నష్టం..
‘గత యాసంగిలో 9 లక్షల టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందుకు రూ.1,668 కోట్లు ఖర్చు చేసింది. ఆ మక్కలకు బయట మార్కెట్లో ధర లేకపోవడంతో వేలం వేయాల్సి వచ్చింది. దీనివల్ల రూ.823 కోట్లు మాత్రమే వచ్చాయి. మార్క్‌ఫెడ్‌కు మొత్తంగా రూ.845 కోట్ల నష్టం వచ్చింది. క్వింటాల్‌కు రూ.1,760 చొప్పున ధర చెల్లించి మార్క్‌ఫెడ్‌ మక్కలను కొనుగోలు చేసింది. సేకరణ, రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి క్వింటాల్‌కు రూ.2 వేలు ఖర్చు కాగా, వేలంలో క్వింటాలుకు రూ.1,150 మాత్రమే వచ్చాయి. మక్కలకు దేశవ్యాప్తంగా మార్కెట్‌ లేకపోవడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది’అని సీఎం వాపోయారు. ‘ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే వర్షాకాలంలో మక్కలు సాగు చేయొద్దని రైతులను కోరింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబాబాద్‌ తదితర జిల్లాల్లో పసుపులో అంతర పంటగా కొద్దిపాటి ఎకరాల్లో మక్కలు వేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ విజ్ఞప్తిని, వ్యవసా యాధికారుల సూచనలు పాటించకుండా కొంత మంది మక్కలు సాగు చేశారు. మక్క లకు మద్దతు ధర రాదని తెలిసినా సాగు చేసి నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. రైతు సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.   రైతులు నష్టపోతుంటే చూస్తూ ఉండలేక మక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’అని సీఎం వివరించారు.

యాసంగిలో కొనుగోలు చేయలేం..
‘మార్క్‌ ఫెడ్, వ్యవసాయ శాఖ, పౌరసరఫ రాల శాఖ సమన్వయంతో ధాన్యం, మక్కల కొనుగోళ్లు చేపట్టాలి. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మక్కలు సాగు చేయొద్దని రైతులను మరోసారి కోరుతున్నా. ఇంత చెప్పినా సరే, మళ్లీ ఎవరైనా మక్కలు సాగు చేస్తే ప్రభుత్వ బాధ్యత ఉండదు. యాసంగిలో పండే మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశాల్లేవు’అని సీఎం స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement