మనం చేసినవన్నీ యువతకు చెప్పండి | CM Revanth Reddy in Zoom meeting with party leaders | Sakshi
Sakshi News home page

మనం చేసినవన్నీ యువతకు చెప్పండి

Published Thu, Feb 20 2025 4:50 AM | Last Updated on Thu, Feb 20 2025 4:50 AM

CM Revanth Reddy in Zoom meeting with party leaders

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకే విజయావకాశాలు 

పార్టీ ముఖ్యనేతలతో జూమ్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి 

ఇంచార్జి హోదాలో తొలిసారి సమావేశానికి హాజరైన మీనాక్షి

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి యువతకు వివరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్ట­భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి అవకాశా­లు ఎక్కువగా ఉన్నాయని, పార్టీ నేతలందరూ సమష్టిగా పనిచేసి అభ్యర్థి వి.నరేందర్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు. 

కరీంనగర్‌–ఆదిలాబాద్‌–నిజామాబాద్‌–మెదక్‌ ఉమ్మడి జి­ల్లా­­ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాత్రి కాంగ్రెస్‌ ముఖ్యనేతల జూమ్‌ మీటింగ్‌ టీపీసీసీ అధ్య­క్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమా­వేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవ­న్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

సమా­వేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు రాష్ట్రంలో స్కిల్స్, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలను మంజూరు చేసి పనులు ప్రారంభించామని, రాష్ట్రంలోని యువ­తకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రెండు లక్షల కోట్ల రూ­పా­యల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. ఈ విషయా­లను యువతకు వివరించడం ద్వారా పార్టీ అభ్యర్థి గెలుపు­నకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. 

తెలంగాణ అంటే అభిమానం: మీనాక్షి 
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నటరాజన్‌ తొలిసారి పార్టీ సమావేశంలో పాల్గొన్నా­రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. రాష్ట్రంలోని చాలా­మంది పార్టీ నాయకులతో తనకు మంచి పరిచయాలు ఉన్నా­యని అన్నారు. 

తెలంగాణను దేశానికి ఒక మోడల్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దామని, రాష్ట్రంలోని పార్టీ నాయకులందరూ కలిసి­కట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు. ఎన్నికలను పార్టీ కేడర్‌ ప్రతిష్టాత్మకంగా తీసు­కోవాలని మీనాక్షి చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement