
బెయిల్ పిటిషన్పై ముగిసిన ఇరుపక్షాల వాదనలు
తీర్పును రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు
సిటీ కోర్టులు: లగచర్లలో అధికారులపై దాడి కేసులో రైతులు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బెయిల్ పిటిషన్పై నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు మంగళవారం ముగిశాయి. సొమవారం రైతుల తరఫున సురేందర్రావు, జక్కుల లక్ష్మణ్, జి.కిరణ్లు వాదనలు వినిపించగా, మంగళవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి అఫ్రోజ్ అక్తర్ తీర్పును రిజర్వ్ చేస్తూ బుధవారానికి వాయిదా వేశారు.
మొదటగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ ఎలక్ట్రానిక్ సమాచారంతోపాటు ఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించి వెంటనే జోక్యం చేసుకున్న రైతుల తరఫు న్యాయవాదులు పీపీ దాఖలు చేసిన ఫొటోల్లో ఉన్న ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని, ఈ ఘటనకు సంబంధం లేని రైతులు, మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో ఒక్కరూ కూడా అరెస్టై రిమాండ్లో లేరని గుర్తు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే అక్కడ దాడికి పాల్పడిన వ్యక్తితో ఫోన్లో మాట్లాడటం, వాట్సాప్ చాట్లు ఉన్నాయని అవన్నీ కోర్టుకు సమర్పించామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు రైతుల అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని వారి ఆరోగ్యం క్షీణిస్తుందని రైతుల తరఫు న్యాయవాదులు కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. నేడు తీర్పును వెలువరించే అవకాశముంది.

Comments
Please login to add a commentAdd a comment