
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాఠశాల వేళలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9గంటలకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
కాగా, తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9-30 నుంచి తొమ్మిది గంటలకు మార్పు చేశారు. అలాగే, సాయంత్రం 4-45కి బదులుగా 4-15 గంటలకు పని వేళలు ముగుస్తాయని విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో తెలిపింది.
అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్లలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులో ఉన్న పని వేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఈమేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు.