![Interesting details in HRD survey conducted by international organization ETS](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Untitled-5.jpg.webp?itok=_snYX5v4)
సాక్షి, హైదరాబాద్: ‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన సాగాలి. యువతకు కాలేజీ స్థాయిలో విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’. ఇవీ మన విద్యారంగంపై సాధారణంగా వ్యక్తమయ్యే అభిప్రాయాలు. కానీ ఈ అభిప్రాయాలకు భిన్నంగా దేశ యువత స్పందించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశ విద్యా విధానానికే జైకొట్టింది.
కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిత భేషుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. టోఫెల్, జీఆర్ఈ తదితర పరీక్షల నిర్వహణ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 18 దేశాల్లో యువతను సంప్రదించిన ఈ సంస్థ.. వారి అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది.
మన విద్యావ్యవస్థపై..
మన దేశ విద్యావ్యవస్థ బాగుంటుందని ఈటీఎస్ సర్వేలో పాల్గొన్న 70% మంది ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో విద్యావ్యవస్థ మరింత పురోగమిస్తుందని 76% మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30% మందే తమ విద్యావ్యవస్థ బాగుంటుందని.. భవిష్యత్తులో విద్యావ్యవస్థ పుంజుకుంటుందని 64% మంది పేర్కొన్నారు.
నాణ్యమైన విద్య.. కష్టంగానే
మన విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం క్లిష్టంగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని 78 శాతం మంది పేర్కొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. దీనివల్ల దేశ విద్యా వ్యవస్థ పురోగతికి అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. నాణ్యమైన కోర్సులు, సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందని కూడా పేర్కొన్నారు.
కెరీర్లో ముందంజలో నిలిచే అవకాశం
ఇక కెరీర్ కోణంలో ప్రస్తుత అవకాశాలతో మందంజలో నిలవడానికి ఆస్కారం ఉంటుందని 69 శా>తం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59 శాతంగానే ఉండటం గమనార్హం. అదేవిధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72 శాతం మంది పేర్కొన్నారు.
ఉద్యోగాల కొరత
విద్యావ్యవస్థ, కెరీర్ కోణంలో ఆశాభావం వ్యక్తం చేసిన మన విద్యార్థులు.. నూతన ఉద్యోగాల విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అలాగే విద్య ఖరీదైన విషయంగా ఉందని 33 శాతం మంది, నైపుణ్యాల పురోగతిలో కొరత ఉందని చెప్పారు.
నూతన నైపుణ్యాలవైపు పరుగులు
లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటాయని 88 శాతం మంది పేర్కొన్నారు.
ఏఐ.. అవకాశాల వేదిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐను ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు.
53 శాతం యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఏఐ లిటరసీ ఉందని భావిస్తుండగా 43 శాతం మంది ఉద్యోగులే అందులో ఉన్నత స్థానంలో ఉన్నామని పేర్కొంటున్నారు. అంటే ఈ రెండు వర్గాల మధ్య 12 శాతం వ్యత్యాసం కనిపిస్తోంది. అలాగే ఏఐ నైపుణ్యాలను గుర్తించేందుకు దేశంలో 79 శాతం యాజమాన్యాలు ప్రామాణిక విధానాలు పాటిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
వాస్తవ పరిస్థితులపై అవగాహన
నేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్ కోసం కాలేజీ స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగుపడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా ఉన్నతవిద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు.
– ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్
ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment