సారీ.. నో లారీ! | Farmers Protest At Grain purchasing Center: Telangana | Sakshi
Sakshi News home page

Lorry: సారీ.. నో లారీ!

May 17 2025 1:19 AM | Updated on May 17 2025 7:06 PM

 Farmers Protest At Grain purchasing Center: Telangana

ధాన్యం అమ్ముకునేదెట్టా అంటున్న రైతులు.. వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు

రాష్ట్రవ్యాప్తంగా అనేక సెంటర్లలో కుప్పలుగా వడ్ల రాశులు..

కొన్నిచోట్ల లారీలు లేవంటూ కాంటా వేసేందుకూ నిరాకరిస్తున్న నిర్వాహకులు

కొన్న ధాన్యం తరలింపులోనూ రోజుల తరబడి జాప్యం..

ట్రాక్టర్ల ద్వారా తరలించుకుంటామంటే హమాలీలు లేరంటున్న వైనం

ఈ యాసంగిలో దాదాపు 1.30 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా 

70.13 ఎల్‌ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావొచ్చని లెక్కలు వేసిన అధికారులు  

అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా తప్పిన ప్రణాళిక! 

ఇప్పటివరకు మొత్తం 51.39 ఎల్‌ఎంటీల ధాన్యం సేకరణ 

సుమారు 10 ఎల్‌ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్నట్లు అంచనా 

అకాల వర్షాలు, ముందస్తు రుతుపవనాల వార్తలతో ఆందోళనలో రైతులు

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, నెట్‌వర్క్‌: ఓవైపు నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు యాసంగి సీజన్‌లో వచ్చిన అధిక దిగుబడితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. నెల రోజులుగా కొనుగోళ్లు సాగుతున్నప్పటికీ.. ఇప్పటికీ చాలా జిల్లా ల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి. 10 నుంచి 20 రోజుల పాటు ఎదురు చూసినా వడ్ల బస్తాలను కాంటా వేయడం లేదని రైతులు వాపోతున్నారు.

కొన్న ధాన్యం తరలించేందుకు లారీలు లేవని, రైతులు సొంతంగా ట్రాక్టర్‌లో తీసుకెళ్తామంటే హమాలీలు లేరని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ధాన్యం రాశుల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. మరిపెడ మండలంలోని ఓ రైతు 600 బస్తాలకు కాంటా వేయించిన తర్వాత లారీలు లేవనే సాకుతో కేంద్రంలోనే వదిలేశారు. ఇప్పటికే అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచగా.. మరోవైపు ముంచుకొస్తున్న వానాకాలం అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సుమారు 10 ఎల్‌ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు 
కేంద్రాల్లో కుప్పలుగా పడి ఉన్నట్లు అంచనా. 

ఇప్పటివరకు 51.39 ఎల్‌ఎంటీల కొనుగోలు 
రాష్ట్రంలో ఈసారి యాసంగి సీజన్‌లో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. దాదాపుగా 1.30 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇందులో 70.13 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. కాగా శుక్రవారం వరకు తెరిచిన 

రాష్ట్రంలోని 8,353 కొనుగోలు కేంద్రాలకు 55.73 ఎల్‌ఎంటీల
ధాన్యం వచ్చిందని,  51.39 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని సేకరించామని, 49.87 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆలస్యంగా వరి సాగు చేసిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ మొదలైన జిల్లాల్లో మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కోతలు పూర్తి అయినప్పటికీ ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న రైతుల్ని చూస్తే అర్ధమవుతుంది.  

ఎందుకు ఆలస్యం? 
కొన్ని కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా రైతులు పడిగాపులు పడుతున్నా వడ్ల బస్తాలకు నిర్వాహకులు కాంటా వేయడం లేదు. ఎందుకంటే.. లారీలు లేవు, హమాలీల కొరత ఉందని నిర్వాహకులు చెపుతున్నారు. లారీలు లేకపోతే ట్రాక్టర్‌తో రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్తామన్నా కూడా హమాలీల కొరత పేరు చెపుతూ కాంటా వేయడం లేదు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, జనగాం తదితర జిల్లాల్లోని అనేక మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ధాన్యం కుప్పలు నిండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా సుమారు 20 ఎల్‌ఎంటీల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది.

వాస్తవానికి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించడానికి ముందే లారీల సరఫరా కాంట్రాక్టును జిల్లా అధికార యంత్రాంగం ఖరారు చేసి, ప్రణాళికాబద్ధంగా కేంద్రాల నుంచి మిల్లులకు వడ్ల బస్తాలను తరలించాల్సి ఉంది. కానీ ఈసారి ప్రణాళిక తప్పిందని అధికారులే అంగీకరిస్తున్నారు. హమాలీల విషయంలోనూ ఇదే జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ధాన్యం దిగుబడి, కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం రావొచ్చనే అంచనాను బట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలో జాయింట్‌ కలెక్టర్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి లారీలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వ ఉండటాన్ని బట్టి చూస్తే లారీల కొరత ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఇక హమాలీలు ఎక్కువ కూలీ లభించే మక్కజొన్న, ఇతర పంటల కొనుగోళ్ల వద్దకు వెళ్లడం, ఉపాధి హామీ పనులకు వెళుతుండడం వల్ల ధాన్యం కేంద్రాలకు రావడం లేదని తెలుస్తోంది. 

కాంటా వేసిన తర్వాత రైతు బాధ్యత ఎలా? 
ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన తర్వాత కాంటా వేసేంత వరకే రైతు బాధ్యత. కాంటా వేసిన తర్వాత రైతుకు ఆ ధాన్యంతో సంబంధం ఉండకూడదు. ప్రభుత్వం కూడా అదే చెబుతుంది. కానీ మిల్లరు ధాన్యం బస్తాలను దించుకునేంత వరకు రైతుదే బాధ్యత అన్నట్టుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

భయపెడుతున్న ముందస్తు రుతు పవనాలు 
గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు ఎన్నో రెట్లు ఎక్కువని ప్రభుత్వం చెపుతోంది. అదే సమయంలో ఈసారి గతంలో కన్నా కొంత ముందుగా నాట్లు వేయడం, సన్న రకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కోతలు ముందే వచ్చాయి. రైతుల అదృష్టం కొద్దీ ఈసారి దిగుబడి కూడా బాగుంది. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్లు ముందుగానే ప్రారంభం కావడంతో ఇప్పటివరకు 51.39 ఎల్‌ఎంటీల  ధాన్యం కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 4.34 ఎల్‌ఎంటీల ధాన్యం కాంటా వేయకుండా ఉందని పౌరసరఫరాల శాఖే చెబుతోంది. అలాగే కొనుగోలు చేసిన ధాన్యంలోనూ ఇంకా సుమారు లక్షన్నర మెట్రిక్‌ టన్నుల ధాన్యం తరలించ లేదని స్పష్టం చేస్తోంది.

అయితే మొత్తంగా సుమారు 10 ఎల్‌ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని అంచనా. కాగా అకాల వర్షాలు రైతులను ప్రతిరోజూ భయపెడుతున్నాయి. భారీ వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల తడిచిన ధాన్యం ఆరితే కానీ రైతులు అమ్ముకోలేని పరిస్థితి ఉంది. తాజాగా.. రుతు పవనాలు ఈసారి ముందుగానే రాష్ట్రంలో ప్రవేశిస్తాయనే వార్తలతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. లారీలు, హమాలీలను అందుబాటు ఉంచడం ద్వారా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

దొడ్డు ధాన్యమే ఎక్కువ..సన్న బియ్యం ఎలా? 
రాష్ట్రంలో 6,58,486 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 51.39 ఎల్‌ఎంటీల ధాన్యంలో దొడ్డు రకం 34.02 ఎల్‌ఎంటీలు కాగా, సన్నాలు 17.37 ఎల్‌ఎంటీలు ఉన్నాయి. సన్నాలు 30 ఎల్‌ఎంటీల వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేయగా, ప్రస్తుత పరిస్థితిని చూస్తే సాధ్యమయ్యే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట , వనపర్తి మొదలైన జిల్లాల్లో పండించిన మేలు రకం సన్న ధాన్యాన్ని రైతులు అధిక ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు సన్నాలు ఆశించిన స్థాయిలో రాలేదు. మరో 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే తప్ప రేషన్‌ దుకాణాలకు ఇవ్వాల్సిన సన్న బియ్యానికి సరిపోవని అధికారులు చెబుతున్నారు.  

ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల వివరాలు.. 
యాసంగిలో ధాన్యం సేకరణ అంచనా        : 70.13 ఎల్‌ఎంటీ 
ఇప్పటివరకు సేకరించిన ధాన్యం        : 51.39 ఎల్‌ఎంటీ 
ఇందులో దొడ్డు రకం (5,44,543 రైతులు)    : 34.02 ఎల్‌ఎంటీ 
సన్న రకం (2,25,215 రైతులు)        : 17.37 ఎల్‌ఎంటీ 
కొనుగోలు చేసిన ధాన్యం విలువ        : రూ.11,913.05 కోట్లు 
రైతులకు చెల్లించిన మొత్తం            : రూ.8,511.42 కోట్లు 
సన్న రకం ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్‌    : రూ.868.61 కోట్లు 

వర్షం వస్తే ఎట్లా..? 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే లారీలు, హమాలీల కొరత, స్థానిక మిల్లుల ట్యాగింగ్‌లో జాప్యంతో పలు కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం కుప్పలుగా పడి ఉంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్‌కు చెందిన గంగవ్వ నాలుగెకరాల్లో పండిన ధాన్యాన్ని స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులవుతున్నా వడ్లు కాంటా కాలేదు. వర్షాల భయంతో ధాన్యంపై కవర్లు కప్పి పడిగాపులు పడుతోంది. జైపూర్‌ మండలం పౌనూరుకు చెందిన జాడి బాపు నాలుగెకరాల్లో పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్నా కాంటా వేయడం లేదు. దీంతో వర్షం వస్తే నష్టపోతానని ఆందోళన చెందుతున్నాడు. మరోవైపు మిల్లర్లు తరుగు పేరుతో 2 నుంచి 5 కిలోలకు పైగా కోత పెడుతున్నారని చెన్నూరు మండలం కిష్టంపేట, ఎల్లక్కపేట తదితర చోట్ల రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.  

తూకం వేసినా.. లారీలు లేక..
మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పైతర కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసినా, లారీలు రాకపోవడంతో వారం రోజులుగా రవాణాకు నోచుకోలేదు. అకాల వర్షాలకు దాదాపు 800 బస్తాల ధాన్యం తడిసింది. దీంతో సంచుల్లోంచి మొలకలు ఇలా బయటకు వచ్చాయి.  

20 రోజులైనా కాంటా కాలేదు..  
నాకు ఉన్న 3 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కాంటా పెట్టలేదు. అదేమంటే లారీల కొరత ఉందని చెబుతున్నారు. రోజూ కేంద్రానికి వచ్చి ఎప్పుడు కాంటా పెడతారా అని ఎదురుచూస్తున్నా. రైతులం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తొందరగా వడ్లు కొనాలి. 
– కొల్లి తిప్పారెడ్డి, రైతు, జటప్రోలు, పెంట్లవెల్లి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement