
సాక్షి, హైదరాబాద్: స్నేహితులంతా కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా, వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వ వెంకటేశ్వర్ రెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి (25) నగరంలోని ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. తన స్నేహితులైన నందకిషోర్, వీరేంద్ర, ప్రణీష్, సాగర్, అరవింద్, ఝాన్సీ, శృతితో కలిసి ఆదివారం కారులో రాచకొండ సమీపంలోని సరళ మైసమ్మ దేవాలయానికి వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న వారు బొంగ్లూర్ వద్ద ఔటర్పై నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తుండగా బలిజగూడ సమీపంలో భారీ వర్షం కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ఘటనలో సౌమ్యారెడ్డితో పాటు పలువురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారికి చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. సౌమ్యారెడ్డి చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
