
కుటుంబ సహకారంతోనే విజయం
‘మా కుటుంబం న్యాయవిద్యతో ముడిపడినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. చిన్ననాటి నుంచి న్యాయశాస్త్రాన్ని చూసి పెరిగిన నేను, ఇప్పుడు అదే కుటుంబ పరంపరలో భాగంగా న్యాయం కోసం పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉంది. ఇది నాకు బాధ్యతను గుర్తు చేస్తోంది, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న కర్తవ్యం కలిగిస్తోంది.’ అని అంటున్నారు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన దారా మేఘన. ఇటీవల వెలువడిన న్యాయశాస్త్ర ఫలితాల్లో వరంగల్ దర్గా కాజీపేటకు చెందిన మేఘన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీనుంచి 2023 న్యాయశాస్త్రం పట్టా పొంది న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె ప్రయాణంపై ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
ఎల్ఎల్బీని ఎందుకు ఎంచుకున్నారు?
నేను న్యాయశాస్త్రాన్ని ఎంచుకోవడానికి కారణం మా నాన్నగారు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే న్యాయవిద్యను నా వృత్తిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. జీవితమంతా ఆయన నాకు మోటివేషన్గా నిలిచారు. మా నాన్న నల్సార్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే నాకు లా స్కూల్ వాతావరణాన్ని, విద్యార్థులను చూడగల అవకాశం కలిగింది. ఇదంతా న్యాయశాస్త్రం పట్ల నాలో ఆసక్తిని, అభిమానం పెంచింది.
మీకు ప్రేరణ ఎవరు.
మా తల్లిదండ్రులే నాకు ప్రేరణ. మా నాన్న న్యాయశాస్త్ర ప్రొఫెసర్, అమ్మ ఎల్ఐసీలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. వారి శ్రద్ధ, క్రమశిక్షణ నన్ను జీవితాన్ని సరిగ్గా ముందుకు నడిపించడంలో కలిసి వచ్చింది. ఏ రంగాన్ని ఎంచుకున్నా, దానికి ప్రోత్సాహం, స్వేచ్ఛను ఇచ్చారు. ఇక తమ్ముడు వంశీకృష్ణ ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచి, విద్యార్థినిగా ఎదుర్కొన్న కష్టాల్లో తోడుగా ఉన్నాడు. అలాగే, ప్రముఖ సీనియర్ అడ్వొకేట్ సి.విద్యాసాగర్ రెడ్డితో పనిచేసే అవకాశం నాకు లభించింది. ఆయననుంచి న్యాయశాస్త్రం ప్రాయోగిక అంశాల్లో మార్గదర్శనం పొందాను. ఈ రంగాన్ని ఎంపిక చేసుకోవాలని ఆయన అప్పట్లో ఇచ్చిన సలహా నా జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఇంకా, మా కళాశాల నుంచి పెద్దగా విజయాలు సాధించిన మా సీనియర్లు తరణి వేముగంటి, నేహా అగర్వాల్ విజయాలను దగ్గరగా చూసే అవకాశం లభించింది. తరణి ప్రస్తుతం సిద్దిపేటలో జూనియర్ సివిల్ జడ్జిగా, అదనపు జేఎంఎఫ్సీగా పనిచేస్తున్నారు. నేహా అగర్వాల్ డీఎస్పీ పదవిని పొందారు. వారి మాటలు నాకు దిక్సూచి చూపాయి.
ఎందుకు న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు.
న్యాయశాస్త్రం ద్వారా న్యాయం సాధించడమే కాక సమాజానికి సేవ చేయవచ్చని నమ్మి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను
మీరు ఎదుర్కొన్న సవాళ్లు.
నా ప్రయాణంలో ఒత్తిడి, ఆందోళన ఎదుర్కోవాల్సి వచ్చింది. సమయం కూడా చాలా పరిమితంగా ఉండటంతో, ఆ సమయంలోనే అన్ని విభాగాలను కవర్ చేయాలన్న ఒత్తిడితో ఉన్నా. ఇదే సమయంలో, మా తమ్ముడు అమెరికాకు మాస్టర్స్ కోసం వెళ్లిపోవడం కూడా నాకు భావోద్వేగపూరితంగా కష్టంగా అనిపించింది. అయితే, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అండగా నిలిచి నా అడ్డంకులను అధిగవిుంచడంలో సహాయం చేశారు.
మీ నెక్ట్స్ గోల్?
ఇప్పటినుంచి నా లక్ష్యం అత్యంత నిజాయితీగా, సమగ్రతతో సేవ చేయడం. న్యాయం వేగంగా అందించడానికీ, ఆలస్యం లేకుండా ప్రజలకు న్యాయం చేసేందుకు కట్టుబడి పని చేయాలనుకుంటున్నాను. నాకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, తమ్ముడికి, స్నేహితులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ విజయాన్ని నాతో కలిసి పంచుకున్న బంధువులకు కూడా ధన్యవాదాలు.