
ఎందరికో గాయాలు, కొన్నిసార్లు మృతులు
పెయింట్స్, ఆర్గానిక్ సాల్వెంట్సే కారణం
పెయింట్ డబ్బాలు ఇళ్లల్లో ఉన్నా ప్రమాదం: నిపుణులు
సాక్షి, హైదరాబాద్: పేలుడు...అది చిన్నదైనా, పెద్దదైనా పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఇటీవల కాలంలో రాజధానిలో తరచుగా చిన్నస్థాయి పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. అత్యధిక ఉదంతాల్లో క్షతగాత్రులే ఉంటుండగా కొన్ని సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ బ్లాస్ట్లకు ప్రధానంగా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించే ఆర్గానిక్ సాల్వెంట్స్ కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమ్మిళిత పదార్ధాలు కలిగి ఉన్న పెయింట్స్ను కొన్ని స్థితుల్లో ఇళ్లల్లో పెట్టుకోవడం ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. శనివారం కుషాయిగూడ పారిశ్రామికవాడలో పెయింట్ డబ్బా పేలి కూలీ నాగరాజు మృతిచెందిన విషయం విదితమే.
పెయింట్ డబ్బాలతోనే సమస్య...
నగరంలో చోటు చేసుకుంటున్న ఇలాంటి చిన్న స్థాయి పేలుళ్లకు పెయింట్ డబ్బాలే ఎక్కువగా కారణంగా మారుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రంగులు వాటిలో వాడే థిన్నర్లలో వలటైల్ ఆర్గానిక్ సాల్వెంట్స్గా పిలిచే ఎసిటోన్, ఈ రసాయనం కలిపిన ట్వాలిన్ , ఈథర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఓ పెయింట్ డబ్బా సీల్ తెరిచిన తర్వాత సగం వినియోగించి మిగిలిన సగాన్ని అలానే ఉంచి మూత పెట్టడం పరిపాటి. మరోసారి వినియోగించడానికి పనికి వస్తుందనే ఉద్దేశంతో దాచి పెడుతుంటారు. ఫలితంగా ఆ డబ్బాల్లో ఉండే రంగుల్లోని ఆవిరి స్వభావం కలిగిన రసాయనాలు అందులో ఉన్న గాలిలోని ఆక్సిజన్తో కలుస్తూ వ్యాకోచించడానికి ప్రయతి్నస్తాయి. గట్టిగా మూత పెట్టి ఉండటంతో అది సాధ్యం కాక డబ్బా లోపలి భాగంలో వాక్యూమ్ ఏర్పడుతుంది. ఈ స్థితిలో ఉన్న డబ్బా మూతలు సైతం బిగుసుకుపోతాయి. అలాంటి వాటిని తెరవడానికి రాపిడి కలిగించినా, గట్టిగా కొట్టినా చిన్నస్థాయి పేలుడు చోటు చేసుకుంటుంది.
ఎక్కువగా బలవుతున్నది వారే...
ఇలాంటి డబ్బాల పేలుడు వల్ల క్షతగాత్రులుగా, మృతులుగా మారుతున్న వారిలో ఎక్కువగా చెత్త ఏరుకునే వాళ్లే ఉంటున్నారు. సగం వాడిన పెయింట్ డబ్బాలను సాధారణంగా ఆ వినియోగదారులు కొన్ని రోజుల పాటే భద్రపరుస్తుంటారు. డబ్బా తుప్పు పడుతున్నప్పుడో, కదిలి్చనప్పుడు పెయింట్ శబ్ధం రాకుంటే పూర్తిగా గడ్డ కట్టేసిందనే భావనతోనో, మూత తీయడం సాధ్యం కానప్పుడో వాటిని బయటపారేస్తుంటారు. సాధారనంగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారేటప్పుడు, దుకాణాలకు మెరుగులు దిద్దే సమయాల్లోనూ ఇలా చేస్తుంటారు. ఆఖరుకు ఈ డబ్బాలు చెత్తకుప్పల్లోకి వచ్చి చేరతాయి. వీటిని కాగితాలతో పాటు ఏరుకునే చెత్త ఏరుకునేవాళ్లు తీసుకుని వాటిని తెరిచే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కలిగే రాపిడి ఫలితంగా పేలుడు జరిగి కొన్నిసార్లు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా ప్రమాదం...
గతంలో పెయింట్స్ను ఇనుప డబ్బాల్లో విక్రయించే వారు. అయితే ఇటీవల కాలంలో దాదాపు అన్ని రకాలైన రంగుల్ని ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఉంచి విక్రయిస్తున్నారు. ఇనుప వాటి కంటే ఇవి అత్యంత ప్రమాదకరమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సగం ఖాళీ అయిన ఇనుప డబ్బాలో ఉన్న రంగుకు ఆక్సిజన్ అందుబాటులోకి రాక రసాయనక్రియ జరగదు. కేవలం గడ్డ కట్టడం మాత్రమే జరుగుతుంది. అదే ప్లాస్టిక్ డబ్బాలో ఉంటే ఉన్న చిన్నపాటి సందుల నుంచి ఆక్సిజన్ వెళ్తుంది. దీంతో పాటు ఆర్గానిక్ సాల్వెంట్స్ కొన్ని రోజులకు ప్లాస్టిక్తో కలిసి పాలిమరైజేషన్ జరుగుతుంది. ఈ కారణంగా ఏర్పడే వేఫరైజర్ల కారణంగానూ దాన్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు పేలుడు జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి డబ్బాలు ఇంట్లో ఉన్నప్పటికీ పేలుడు ప్రమాదాలు తప్పవని నిపుణులు వివరిస్తున్నారు.
ఈ తరహా పేలుళ్లకు ఉదాహరణలు
⇒ మీర్ పేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ పోష్ కాలనీలో చెత్త ఏరుకునే నిర్మల ప్లాస్టిక్ డబ్బాను తెరిచే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డారు.
⇒ నాచారంలో రసాయనంతో కూడిన డబ్బా చేతిలో పేలడంతో ఓ చిన్నారికి గాయాలు అయ్యాయి.
⇒ హైదరాబాద్ రాజేంద్రనగర్లో టిన్ పేలి అలీ అనే వ్యక్తి మరణించాడు. పీవీ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెం.279 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
⇒ బాలానగర్ పరిధిలోని రంగారెడ్డి నగర్లో నీలమ్మ (45) అనే పారిశుద్ధ్య కారి్మకురాలు రసాయనాల డబ్బాలతో కూడి వ్యర్థాల సంచిని శుభ్రం చేసే ప్రయత్నం చేసింది. ఆ సంచిలోని డబ్బా పేలడంతో ఆమె ఎడమ కాలి బొటనవేలు ఛిద్రమైంది.
సీల్ తీస్తే వాడేయాలి
ఆర్గానిక్ సాల్వెంట్స్ కలిగి ఉండే పెయింట్స్ను డబ్బా సీల్ తీసిన తర్వాత పూర్తిగా వాడేయడం ఉత్తమం. అలా కాకుండా కొంత మిగిలితే బయట పారబోయాలి. తర్వాత వినియోగిద్దామనే ఉద్దేశంతో దాచి పెట్టినా, కొన్నాళ్ళకు పారేసినా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటి డబ్బాలు తెరవడానికి ప్రయతి్నంచిన ప్రతిసారీ పేలిపోవాలని లేదు. పేలుడుకు చోటు చేసుకోవడానికి అవసరమైన స్థాయిలో సాల్వెంట్స్ రేష్యో తయారైతేనే అలా జరుగుతుంది. ఇలా సగం ఖాళీ అయిన డబ్బాలు ఇంట్లో ఉండి, వాటిని తెరవాల్సిన అవసరం వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిని వెంటనే తెరవకుండా కనీసం గంట సేపు చల్లని నీటిలో ఉంచాలి. ఫ్రిజ్ వాటర్ను బక్కెట్లో పోసి అందులో ఈ డబ్బాలను వేయాలి. ఇలా చేస్తే అందులో ఉన్న ఆవిరి చల్లబడి మళ్లీ పెయింట్గా మారుతుంది. అప్పుడు రాపిడి కలిగిస్తూ తెరిచినా ఎలాంటి ప్రమాదం ఉండదు.
– ఫోరెన్సిక్ నిపుణులు