
కిష్టారెడ్డి పేట మైత్రి విల్లాస్ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది
సాక్షి, సంగారెడ్డి జిల్లా: కిష్టారెడ్డి పేట మైత్రి విల్లాస్ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. బండారు మహేశ్వర్ అనే వ్యక్తి నడుపుతున్న హాస్టల్లో స్పై కెమెరాలను విద్యార్థినులు గుర్తించారు. విల్లా నంబర్ 75లోని హాస్టల్లో కెమెరాను గుర్తించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమీన్ పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి పోలీసులు విచారిస్తున్నారు. స్పై కెమెరాలోని పలు చిప్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

కాగా, లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లో భార్య, తల్లి గొడవ పడుతున్నారనే కారణంగా మహేశ్వరరావు అనే వ్యక్తి మొదట ఇంట్లో స్పై కెమెరా పెట్టినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు అమెజాన్లో ఓ కెమెరాను కొనుగోలు చేసిన మహేశ్వరరావు.. ఆ తర్వాత హాస్టల్ కిచెన్లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. ఎవరికి తెలియకుండా అమ్మాయిల రూమ్లో కూడా కెమెరా పెట్టాడు. ఓ యువతి కెమెరా చూసి పసిగట్టడంతో ఈ బాగోతం బయటపడింది.