
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సీఐడీ దూకుడు పెంచింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు 13మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లైంది.
తాజాగా,పోలీసులు అరెస్ట్ చేసిన ఈ ఇద్దరు ఏజెంట్లు చెన్నైకి చెందిన శంకరన్ అలియాస్ సాయి శంకరన్, ఎన్ రమ్యలని సమాచారం. నిందితులని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తెలంగాణకు తీసుకొచ్చిన సీఐడీ..వారి పాస్ పోర్టులు, మొబైల్స్ను సీజ్ చేసింది.
నిందితులు తమిళనాడుకు చెందిన అమాయక, ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులను లక్ష్యంగా కిడ్నీ వ్యవహారం నడుపుతున్నారు. బాధితులను తమిళనాడుకు తీసుకువచ్చి హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ ముఠా నడిపిస్తున్నాడు. ఇలా ప్రతి కిడ్నీ మార్పిడికి నిందితులు రూ.10 లక్షల కమిషన్ తీసుకుంటున్నారు. కిడ్నీ దాతలకు రూ.4-5 లక్షలు ఇస్తున్నారు. కాగా,ఇదే కేసులో మరో ఏడుగురు నిందితుల కోసం తెలంగాణ పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.