TSRTC Has Increased T-9 Ticket Timings - Sakshi
Sakshi News home page

TSRTC: ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌.. 

Published Fri, Jul 7 2023 8:49 PM | Last Updated on Fri, Jul 7 2023 8:54 PM

TSRTC Has Increased T-9 Ticket Timings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన 'టీ-9 టికెట్‌' సమయాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్‌ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.

టీ-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.20 కాంబి టికెట్‌ వర్తిస్తుంది. టీ-9 టికెట్‌ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్‌ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. 

అయితే, ‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టి-9 టికెట్‌ను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ టికెట్ ద్వారా రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. జూన్‌ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 11 వేల మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారు. టీ-9 టికెట్‌ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకువచ్చారు. 

ఈ అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని సంస్థ పెంచింది. తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబితో టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ టికెట్‌ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. సంస్థను ఆదరించాల’ అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ కోరారు. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోండగా.. తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చిందని వారు తెలిపారు. ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: నవ్య ఎపిసోడ్‌.. ‘ఆడియోలు, వీడియోల’పై రాజయ్య సవాల్‌, కడియంపైన సంచలన ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement