ప్రదక్షిణలు.. పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

ప్రదక్షిణలు.. పడిగాపులు

Published Wed, Mar 5 2025 9:48 AM | Last Updated on Wed, Mar 5 2025 9:48 AM

ప్రదక్షిణలు.. పడిగాపులు

ప్రదక్షిణలు.. పడిగాపులు

దోమ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ రైతులందరికీ పూర్తిస్థాయిలో ఎప్పుడు అమలవుతుందోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సంపూర్ణంగా రుణమాఫీ కాలేదు. దీంతో నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వారు మొత్తం చెల్లిస్తే మిగతావి మాఫీ చేస్తామని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు అప్పులు తెచ్చి మరీ బ్యాంకుల్లో రుణాలు చెల్లించారు. అయితే ఇప్పటివరకు రూ.2లక్షల మాఫీ సొమ్ము సర్కారు నుంచి విడుదల కాలేదు.

తప్పని ఎదురుచూపులు

మండలంలో పీఏసీఎస్‌ సొసైటీలో 1,598 మంది రైతులు ఉండగా రూ.8.94 లక్షల రుణాలను అధికారులు అందజేశారు. అందులో 1,099 మంది రైతులకు ఇప్పటివరకు రూ.6.12 లక్షలు మాఫీ అయ్యాయి. కాగా మిగతా 499 మంది రైతులకు రూ.2.82 లక్షలు నేటికి రుణమాఫీ కాలేదు. దీంతో నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అధికారులతో రుణమాఫీ గురించి పలుమార్లు ఆరా తీసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు.

మాఫీ కాని రైతుల ఆగ్రహం

నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి అంతా గోప్యత పాటిస్తుండడంతో రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై ఏ అధికారిని అడిగినా తమకు తెలియదంటూ దాట వేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అట్టహాసంగా ఏడాది ప్రజాపాలన ఉత్సవాల్లో ప్రకటించి ఇప్పుడు ప్రజాప్రతినిధులు సైతం నోరు మెదపకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జాబితా ప్రకారం రుణమాఫీ డబ్బులు విడుదల చేయాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఇంకా సాంకేతిక సమస్యలతో రూ.రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులంతా మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. వారందరిలో రుణమాఫీ జరుగుతుందో? లేదోనని ఆందోళన నెలకొంది.

ఆందోళన చెందొద్దు

రుణమాఫీ కానీ రైతులు కార్యాలయానికి వచ్చి అడుగుతున్నారు. ప్రస్తుతం జాబితాను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాగానే అర్హులకు రుణమాఫీ వర్తించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఆందోళన చెందొద్దు.

– ప్రభాకర్‌రావు, వ్యవసాయఅధికారి, దోమ

నిత్యం తిరుగుతున్నా

ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా నేటికీ రుణమాఫీ కాలేదు. నాకు నాలుగు ఎకరాల భూమి ఉండగా, అందు లో పీఏసీఎస్‌ సొసైటీలో గతంలో రూ.లక్ష రుణం తీసుకున్నా. ఇప్పటివరకు ప్రభుత్వం రుణమాఫీ చేయ లేదు. నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా.

– పెద్దమల్లయ్య, రైతు, కొత్తపల్లి

ప్రభుత్వం నుంచి లిస్టు రాగానే..

పీఏసీఎస్‌లో 1,598 మంది రైతులు ఉండగా, అందులో 499 మందికి రుణమాఫీ కాలేదు. వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. పలువురు కార్యాల యం చుట్టూ నిత్యం చక్కర్లు కొడుతున్నారు. ప్రభుత్వం నుంచి లిస్టు రాగానే పరిశీలించి మాఫీ చేస్తాం.

– యాదగిరి, సీఈఓ, పీఏసీఎస్‌, మోత్కూర్‌

పూర్తి రుణమాఫీ అమలయ్యేదెన్నడో?

మోత్కూర్‌ పీఏసీఎస్‌లో 499 మంది రైతులకు మొండిచేయి

అయోమయంలో అన్నదాతలు

పట్టించుకోని అధికార యంత్రాంగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement