శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం

Published Fri, Mar 7 2025 9:06 AM | Last Updated on Fri, Mar 7 2025 9:04 AM

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం

మణికొండ: రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. అందుకు అనుగుణంగానే నేరాలు, కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏకంగా సంవత్సరానికి దాదాపు 2 వేల కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందులో ఎక్కువగా భార్యాభర్తల తగాదాలతో పాటు ఆర్థిక, సెలబ్రిటీలు, ఐటీ ఉద్యోగుల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. జనాభాకు అనుగుణంగా ఇప్పటికే నార్సింగి కేంద్రంగా ఏసీపీ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న జన్వాడ, మిర్జాగూడలను కొత్తగా వచ్చిన మోకిల స్టేషన్‌ పరిధిలోకి మార్చారు. ప్రస్తుత నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోకాపేటలో ఒకటి, పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలోని కొంత భాగంతో ఐటీ జోన్‌ కేంద్రంగా మరో కొత్త పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది.

● కోకాపేట నియోపోలీస్‌లో శరవేగంగా నిర్మాణాలు, ఐటీ సంస్థలు వస్తుండటంతో జనాభా పెరిగిపోతుంది. అనేక రాష్ట్రాల వారే కాకుండ ఇతర దేశాల వారు సైతం వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో కొత్తగా కోకాపేట పేరుతో పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

● పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలో ఔటర్‌ రింగ్‌ అవతలి ఐటీ జోన్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని ఓ పోలీస్‌ స్టేషన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటితో పాటు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌, అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సులేమాన్‌నగర్‌ కేంద్రంగా మరో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు.

● దాంతో రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో కొత్తగా మరో నాలుగు పోలీస్‌స్టేషన్‌లు రాబోయే బడ్జెట్‌లో మంజూరు అయ్యే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

● ఇప్పటికే శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ఉన్న ఔట్‌పోస్టును పూర్తి స్థాయి పోలీస్‌స్టేషన్‌గా ప్రకటించి ఇటీవల సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి త్వరలోనే మరిన్ని పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

మారనున్న పరిధి...

● నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న కోకాపేట, గండిపేట, ఖానాపూర్‌ గ్రామాలు కొత్తగా వచ్చే కోకాపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి తేనున్నట్టు సమాచారం. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న వట్టినాగులపల్లి, నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న పుప్పాలగూడ ఐటీ జోన్‌ ప్రాంతంతో కలిపి గౌలిదొడ్డి, సైబరాబాద్‌ ఐటీ జోన్‌ పోలీస్‌స్టేషన్‌ పేరుతో కొత్త స్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. ఇక నార్సింగి, రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ఉన్న కిస్మత్‌పూర్‌, బండ్లగూడ, హిమాయత్‌సాగర్‌లతో బండ్లగూడ కేంద్రంగా మరో పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు కానుంది.

● అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న సులేమాన్‌నగర్‌, శాస్త్రీపురం డివిజన్‌లను కలిపి కొత్త పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. త్వరలోనే కొత్తగా పోలీస్‌ సిబ్బంది నియామకం చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుందని, అందుకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

మరో నాలుగు పోలీస్‌స్టేషన్లఏర్పాటుకు సన్నద్ధం

ప్రభుత్వానికి ప్రతిపాదించినపోలీసు ఉన్నతాధికారులు

వచ్చే బడ్జెట్‌లో మంజూరుకు సన్నాహాలు

జూన్‌ వరకు ఏర్పాటుకు రంగం సిద్ధం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement