బైక్‌ దొంగకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌ దొంగకు రిమాండ్‌

Mar 16 2025 7:38 AM | Updated on Mar 16 2025 7:38 AM

బైక్‌ దొంగకు రిమాండ్‌

బైక్‌ దొంగకు రిమాండ్‌

ఆమనగల్లు: బైక్‌ను చో రీ చేసిన వ్యక్తిని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఆమనగల్లు ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపారు. మున్సిపల్‌ పరిధిలోని విఠాయిపల్లి గ్రామానికి చెందిన సబావత్‌వాల్య గత ఏడాది డిసెంబర్‌లో తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట పార్క్‌ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన హాజీ బైక్‌ను చోరీ చేసినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హాజీని కోర్టులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలించారు.

చికిత్స పొందుతూ గర్భిణి మృతి

వైద్యుల నిర్లక్ష్యమంటూ బంధువుల ఆరోపణ

శంషాబాద్‌ రూరల్‌: ఛాతి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణి మృతి చెందింది. ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌ నివాసి బుషమోని ప్రమీల(33) 9 నెలల గర్భిణి. మొదటి నుంచి ముచ్చింతల్‌ శివారులోని జిమ్స్‌ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతుంది. నెలలు నిండడంతో ప్రమీలను ఈ నెల 11న జిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 13వ తేదీ వరకు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమెను వైద్యులు ఇంటికి పంపించారు. 18న ఆస్పత్రికి రావాలంటూ డాక్టర్‌ పూజిత కొన్ని మందులు రాసిచ్చారు. శుక్రవారం రాత్రి ప్రమీల భోజనం తర్వాత వైద్యులు ఇచ్చిన మందులు వేసుకుంది. కాసేటి తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో భర్త సాయిబాబు ఆమెను రాత్రి 10.30 గంటలకు జిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ఆమెను పరిశీలించారు. 12.15 గంటలకు డాక్టర్‌ రామారావు ఆమెను పరీక్షించగా అప్పటికే చనిపోయింది. సకాలంలో వైద్యం అందక తన భార్య మృతి చెందిందని, ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సాయిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మద్యం మత్తులో యాసిడ్‌ తాగి వృద్ధుడి మృతి

శంషాబాద్‌ రూరల్‌: మద్యం తాగిన మత్తులో ఓ వృద్ధుడు యాసిడ్‌ తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇన్‌స్పెక్టర్‌ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని నర్కూడ వాసి కమ్మరి ఆనంద్‌ చారి(62) ఈ నెల 14న హోలీ ఆడి సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రాత్రి తాగిన మత్తులో బాత్రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న యాసిడ్‌ తాగి బయటకు వచ్చాడు. అతని షర్ట్‌పై మరకలను గమనించిన భార్య లక్ష్మి బాత్రూమ్‌లోకి వెళ్లి చూసింది. యాసిడ్‌ బాటిల్‌ మూత తీసి ఉండడంతో పాటు అందులో యాసిడ్‌ సగం మాత్రమే ఉంది. వెంటనే అతన్ని శంషాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి..అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ స్థలంలో డంపింగ్‌

మణికొండ: ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా ఓ నిర్మాణ సంస్థ డంపింగ్‌ చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని కోకాపేటవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట రెవెన్యూ సర్వే నెంబర్‌ 144లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాని పక్కనే ఓ నిర్మాణ సంస్థ తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. బిల్డింగ్‌ వేస్ట్‌ మెటీరియల్‌ను ప్రభుత్వ భూమిలోకి పడేయటంతో పక్కనున్న నివాసాల్లో దుమ్ము చేరుతుంది. దాంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇదే విషయాన్ని అటు నిర్మాణ సంస్థ, ఇటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement